టీడీపీకే స్పష్టత లేదు, ‘విజయవాడ’తో ఉత్తరాంధ్రకు నష్టం: కొత్తపల్లి గీత, ‘వైసీపీవీ నాటకాలే’
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారో తెలుగుదేశం పార్టీకే స్పష్టత లేదని అరకు పార్లమెంటుసభ్యురాలు కొత్తపల్లి గీత విమర్శించారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
Recommended Video
రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో కూడా టీడీపీకి స్పష్టత లేదని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై వారంలోగా వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి సహా కేంద్రమంత్రులకు లేఖలు రాశానని తెలిపారు.
ఉత్తరాంధ్రకు నష్టం
కేంద్రం నుంచి సమాధానం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఎంపీ తెలిపారు. కాగా, అన్ని సంస్థలూ విజయవాడ, అమరావతికే వెళ్తున్నాయన్నారు. ఎయిమ్స్ విజయవాడకు వెళ్లడంతో ఉత్తరాంధ్రకు నష్టం జరిగిందన్నారు. రైల్వేజోన్ విశాఖకు రావాలని, అది విశాఖ ప్రజల హక్కు అని వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు అతీతంగా..
రాజకీయాలకు అతీతంగా అందరం రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడాలని, ప్రజల్ని నష్టపరచకుండా నాయకులు వ్యవహరించాలని సూచించారు.
టీడీపీ ఏం చేస్తోంది..
స్వాతంత్య్ర పోరాటమంటున్న టీడీపీ నాలుగేళ్లుగా ఏం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శ మధు ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఈ మహాసభల్లో 60 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ సినియర్ నేత వైవీతో కలిసి మధు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.
వైసీపీవీ నాటకాలే
విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తుంటే ప్రశ్నించాల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకేమీ పట్టనట్టు ప్రవర్తిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. కేంద్ర విద్యాసంస్థలకు రూ. 6 వేల కోట్ల ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి లేఖ ఇస్తే ఇప్పటివరకు కేంద్రం రూ.421 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం నేపథ్యంలో వామపక్షాల ఆద్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇచ్చి మద్దతు కోరితే వైసీపీ చూద్దాం.. ఆలోచించి చెబుతాం అని దాటవేత ధోరణితో వ్యవహరించిందన్నారు. ఇప్పుడు మండల స్థాయి ఉద్యమాల పేరిట నాటకాలాడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని ఉద్యమిస్తామని మధు స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని మధు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల బుధవారం వామపక్షాల భేటీ జరగనుందని మధు వెల్లడించారు. ఆ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.