300 మంది చనిపోయారా: జగన్కు రాజప్ప, ఒళ్లు దగ్గర: దేవినేని
రాజకీయ గొడవల్లో 300 మంది హత్యకు గురయ్యారంటూ గవర్నర్ నరసింహన్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని హోంమంత్రి చినరాజప్ప బుధవారం అన్నారు.
అమరావతి: రాజకీయ గొడవల్లో 300 మంది హత్యకు గురయ్యారంటూ గవర్నర్ నరసింహన్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని హోంమంత్రి చినరాజప్ప బుధవారం అన్నారు.
300 మంది ఎక్కడ చనిపోయారో జగన్ చెప్పాలని సవాల్ విసిరారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే రాజకీయ హత్యలు ఎక్కువగా జరిగాయన్నారు.
అద్దంకి, పత్తికొండల్లో జరిగిన హత్యలు ఫ్యాక్షన్ హత్యలని, వీటికి రాజకీయ నేపథ్యం లేదన్నారు. ఫ్యాక్షనిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చినరాజప్ప చెప్పారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు కొనసాగుతుందన్నారు.
వివాదాన్ని పరిష్కరించడంలో సీఐ రామారావు విఫలమయ్యారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకున్నామన్నారు. విశాఖలో జరగనున్న మహానాడు సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని, జిల్లాకు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.
ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: దేవినేని
టిడిపి నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని మంత్రి దేవినేని ఉమా అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోతే నాయకులుగా ఉండి ఏం లాభమన్నారు.
పదవిలోకి రాగానే గొప్పవాడిని అయిపోయాననే అహంకారం వస్తోందని, ఆ ఆలోచన నుంచి బయటపడాలని దేవినేని సూచించారు. రాష్ట్రంలో మరో యాభై ఏళ్లు టిడిపి అధికారంలో ఉండాలన్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు, వైఎస్సార్సీపీ నేతల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యతో తమకు సంబంధం లేదన్నారు.
కేరాఫ్ అడ్రస్ జగన్: సతీష్
హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసిపి అధినేత జగన్ అని టిడిపి ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. తరతరాలుగా వైయస్ కుటుంబం హత్యాకాండను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
జగన్ రక్తచరిత్రను కప్పిపుచ్చుకోవడానికి టిడిపిపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు టిడిపి దూరంగా ఉంటుందన్నారు. తన కేసులలో సిబిఐని విమర్శించే జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని సిబిఐ విచారణ కోరుతున్నారని ప్రశ్నించారు.