నంద్యాలపై మలుపు, అఖిలప్రియకు బాబు షాక్: తెరపైకి ఎస్పీవై రెడ్డి
నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీలో కొత్త ట్విస్ట్. శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరిన నేపథ్యంలో భూమా బ్రహ్మానంద రెడ్డికి టిడిపి టిక్కెట్ దాదాపు ఖాయమైందని భావించారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీలో కొత్త ట్విస్ట్. శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో భూమా బ్రహ్మానంద రెడ్డికి టిడిపి టిక్కెట్ దాదాపు ఖాయమైందని అందరూ భావించారు.
చదవండి: అఖిలప్రియ దూకుడు, చంద్రబాబు అసహనం
కానీ హఠాత్తుగా మరోపేరు తెరపైకి వచ్చింది. ఆయనే ఎంపీఎస్పీవై రెడ్డి. దీంతో అభ్యర్థి ఎంపిక మరో మలుపు తిరిగింది. ఎంపీ ఎస్పీవై రెడ్డికకి ఉన్నపళంగా విజయవాడకు రావాలని అధిష్టానం నుంచి శుక్రవారం నాడు పిలుపు వచ్చింది.
చంద్రబాబుతో ఎస్పీవై రెడ్డి భేటీ
దీంతో ఆయన కుటుంబం హుటాహుటిన నంద్యాల నుంచి విజయవాడకు బయలుదేరింది. నంద్యాల ఉప ఎన్నికపై శనివారం టిడిపి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో నంద్యాల అభ్యర్థిపై టిడిపిలో స్పష్టత వచ్చే అవకాశముంది.
తెరపైకి కొత్త పేరు
తొలుత నంద్యాల ఉప ఎన్నికల రేసులో టిడిపి నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలు ఉన్నారు. తనకు టిక్కెట్ రాదని గుర్తించిన శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరారు. దీంతో బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ ఖాయమని భావించారు. కానీ ఎస్పీవై రెడ్డి తెరపైకి వచ్చారు.
అఖిలప్రియకు ఝలక్
బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ ఖాయమనుకున్న సమయంలో ఎస్పీవై రెడ్డి పేరు తెరపైకి రావడం... అఖిలప్రియ దూకుడుతో అధిష్టానం అసంతృప్తి చెందడమే కారణం కావొచ్చని అంటున్నారు. అఖిల తీరు వల్లే తాను పార్టీ వీడానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు.
దూకుడుపై చంద్రబాబు గుర్రుగా..
తాజాగా, భూమా కుడిభుజం ఏవీ సుబ్బారెడ్డి కూడా అఖిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అఖిలపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్పీవై రెడ్డి పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఎస్పీవై రెడ్డి 2014లో వైసిపి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు.