జగన్ కు చంద్రబాబు లేఖ-ఏపీపీఎస్సీ నిర్వీర్యం- గ్రూప్ 1 అంతా అక్రమాలే-విచారణకు డిమాండ్
ఏపీపీఎస్సీ పరీక్షలు, మూల్యాంకనంలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై కొంతకాలంగా పోరాడుతున్న విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ సీఎం జగన్ కు దీనిపై లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపికలో అవకతవకలపై ఆయన ఈ లేఖ రాశారు.
నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యమైనట్లుందని సీఎం జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలవుతుందని మూడేళ్లగా యువత ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేయడంలో గత 3 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్ధుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తోందని జగన్ కు చంద్రబాబు తెలిపారు.
2018లో ప్రకటించిన 165 గ్రూప్-1 ఉద్యోగాలకు డిసెంబర్ 2019లో వ్రాత పరీక్షలు జరిపి మే 2021లో ఫలితాలు ప్రకటించారని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. మెయిన్స్ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారని చంద్రబాబు విమర్శించారు. పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగిందని ఆరోపించారు. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కార్యదర్శి, కమిషన్ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్ధులు భావిస్తున్నారని చంద్రబాబు సీఎం జగన్ కు రాసిన లేఖలో వివరించారు.
ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనంకు, రెండవ మూల్యాంకనంకు ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్-1 మెయిన్స్లో అక్రమాలకు తెరతీశారన్నారు. మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్దులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చంద్రబాబు తెలిపారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్దులకు న్యాయం చేయవలసిందిగా ఆయన కోరారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్దులు ఫిర్యాదు చేశారని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.