అప్పుడే జవాబు: పవన్ కళ్యాణ్పై ఆగని దాడి, 'ఫెయిల్' అయితే తిరిగొస్తారా?
హైదరాబాద్/విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం కాకినాడ సభలో చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగడం లేదు. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం మరోసారి పాచిపోయిన లడ్డూల పేరుతో కౌంటర్ ఇచ్చారు.
లడ్డూలు పాచిపోవచ్చని, కానీ డబ్బులు మాత్రం పాచిపోవని పునరుద్ఘాటించారు. కొందరు కేంద్రం ఇచ్చే ప్యాకేజీని చూడకుండా, ప్రత్యేక హోదా గురించే పట్టుబడుతున్నారని, ఇది సరికాదని ఆయన జనసేనానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అడపాదడపా ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ వ్యాఖ్యల పైన స్పందిస్తున్నారు.

చూసీ చూసీ..
కాకినాడ సభలో పవన్ ఆవేశంగా, ఆవేదనగా మాట్లాడిన విషయం తెలిసిందే. హోదా కోసం ఆయన రెండున్నరేళ్లు వేచి చూసి నిలదీశారని, ఆయనది ఆవేదన నుంచి పుట్టిన ఆవేశమని చెబుతున్నారు. ఆయన మాటల్లో నిజాయితీ ఉందని, ఆయన ఆవేశంలో నిజాయితీ ఉందనే వాదనలు వినిపించాయి.

సభలు పెడతానని...
అదే సమయంలో, ప్రత్యేక హోదా గురించి ఇక నుంచి వరుస సభలు పెడతానని, నిలదీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బీజీగా మారిపోయారు. దీంతో దీనిని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక సమస్య పైన ఇలా వచ్చి, మాట్లాడి అలా వెళ్లిపోవడం ఏమిటని అంటున్నారు.

రంగంలోకి దిగేనా?
రెండున్నరేళ్ల తర్వాత.. ఇటీవలే పవన్ తాను ఉద్యమిస్తానని చెప్పారని, ఆ తర్వాత నాయకుల వల్ల సాధ్యం కానప్పుడు రంగంలోకి దిగుతానని చెప్పి, పరోక్షంగా ఆగిపోయారనే వాదనలు కూడా వినిపించాయి. ఆ తర్వాత సినిమా షూటింగులో బీజీ అయ్యారు.

ఏం చేసేనో?
సినిమా షూటింగ్ తర్వాత.. అప్పటి లోగా నాయకులు హోదా విషయంలో ఫెయిల్ అయితే, ఆయన మళ్లీ ఉద్యమిస్తారా చూడాల్సి ఉందని అంటున్నారు. లేక 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినందున డబ్బులు సమకూర్చుకునేందుకు వరుస సినిమాలు తీస్తారా చూడాలని అంటున్నారు. పవన్ పైన వరుస దాడి నేపథ్యంలో.. ఆయన పైన నేతల స్పందన, దానికి కొందరు అభిమాననుల కౌంటర్ ఇలా కనిపిస్తోంది.

రెండున్నరేళ్లకు అడిగినా..
పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చారన్న పవన్ కళ్యాణ్ పైన బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇరువురి మధ్య గ్యాప్ వచ్చింది కూడా. అయితే రెండున్నరేళ్ల పాటు వేచి చూసిన పపన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగారని జనసేన కార్యకర్తలు అన్నారు. ఇన్నాళ్ల తర్వాత అడిగితే ఎదురు దాడి చేయడం ఏమిటని వారు కౌంటర్ ఇచ్చారు.

అన్నం తినలేదన్న దానిపై విమర్శలు, కౌంటర్
విభజన జరిగిన సమయంలో తాను పదకొండు రోజుల పాటు అన్నం తినలేదని పవన్ నాటి సభలో అన్నారు. దీంతో ఆయన ఏదో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన అన్న దాంట్లో తప్పులేదని చాలామంది అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోనే పుట్టి, పెరిగినందున ఇది మనది అనే సెంటిమెంట్ ఉంటుందని, ఆ బాధతో ఆయన అలా మాట్లాడి ఉంటారని, అదే సమయంలో ఆయన విభజనను వ్యతిరేకించలేదని, తెలంగాణ ప్రజల వాదాన్ని బలపర్చారని, పైగా.. సెక్షన్ 8 పైన కూడా నిక్కచ్చిగా మాట్లాడారని చెప్పారు.

స్వాగతించిన కవిత
ఇదిలా ఉండగా, హైకోర్టు విభజన పైన నాడు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ కవిత మాత్రం స్వాగతించారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలన్న పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించారు.












Click it and Unblock the Notifications