పవన్ ఎఫెక్ట్, పట్టించుకోని ఫ్యాన్స్: చిరు టూర్ ఫ్లాఫ్ షో?
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నేతృత్వంలోని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ బస్సుయాత్రకు ఆదరణ కనిపించలేదని, ఫ్లాఫ్ షోగా ముగుస్తోందంటున్నారు. రాష్ట్ర విభజనకు గల కారణాలను ప్రజలకు తాము చెబుతామని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సీమాంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టారు.
వారి బస్సుయాత్రకు ఆదరణ అంతగా కనిపించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బస్సుయాత్ర అసలు ప్రారంభమే వెలితిగా కనిపించిందంటున్నారు. బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా పలుచోట్ల సభల్లో కుర్చీలు ఖాళీగా కనిపించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై చిరంజీవి స్వయంగా అసహనం వ్యక్తం చేశారు.
ఇక వీరి బస్సుయాత్రకు కడప జిల్లాలో స్పందన ఆ మాత్రం కూడా కరువయిందంటున్నారు. జిల్లాలో నేతలు సైతం దూరంగా ఉన్నారు. యాత్రకు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు బత్యాల చెంగల్రాయులు, షేక్ హుస్సేన్లు డుమ్మా కొట్టారు. చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరిన బస్సుయాత్ర బుధవారం కడప జిల్లాలో ప్రవేశించింది.
బస్సు యాత్రలో చిరంజీవి, పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డితో పాటు జెడి శీలం, కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రులు సి రామచంద్రయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, బాలరాజు తదితరులు జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
గతంలో పిఆర్పీ అధినేతగా చిరంజీవి ప్రచారానికి వచ్చినపుడు ప్రచారానికి కిలో మీటర్ల పొడవునా అభిమానులు, కార్యకర్తలు బారులు తీరారు. ఇసుకేస్తే రాలదన్నట్లుగా లక్షల్లో జనం పోటెత్తారు. అలాంటి చిరంజీవి కాంగ్రెస్ ప్రచార సారథిగా చేపట్టిన బస్సుయాత్రకు కనీసం వందల సంఖ్యలో కూడా జనం కనిపించలేదంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినందున అభిమానులు కూడా చాలామంది చిరంజీవి యాత్రకు దూరంగా ఉన్నారంటున్నారు. చిరంజీవి జిల్లాకు వస్తున్నారని వారం రోజులు నుంచి ప్రచారం జరుగుతున్నా ఆయన అభిమానులు కూడా పట్టించుకోలేదంటున్నారు.