ఏపీకి దక్కాల్సింది వెంటనే ఇవ్వండి; న్యాయ సమీక్షకు వెళ్లకుండా పరిష్కరించండి: ఏపీ విభజన అంశాలపై సజ్జల
ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విభజనపై రచ్చ కొనసాగుతోంది. ఏపీ విభజన గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీలు ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. తాజాగా ఏపీ విభజన సమస్యల అంశాన్ని కేంద్ర హోంశాఖ అజెండాలో చేర్చడంపై ఏపీ లోని రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు.
మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ; మూల్యం చెల్లిస్తున్నారుగా బాబూ: సాయిరెడ్డి సెటైర్లు
న్యాయంగా ఏపీకి రావాల్సిన వాటిని దక్కేలా చూడడం కేంద్రం బాధ్యత
తాజాగా తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజా పరిణామాల పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన సమస్యల అంశాన్ని కేంద్ర హోంశాఖ జెండాలో చేర్చటం సంతోషకరమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నాడు అన్యాయంగా ఏపీని విభజించారని, ఏపీకి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి రావలసినవి ఏవీ రాలేదని, న్యాయంగా ఏపీకి రావాల్సిన వాటిని దక్కేలా చూడడం కేంద్రం బాధ్యత అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏపీకి ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలలో ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ఆచరణ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు వేదికగా కూడా వైసిపి ఎంపీలు తమ గళాన్ని వినిపించారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏపీకి ప్రత్యేక హోదా అని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
న్యాయ సమీక్షకు వెళ్లకుండా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి
తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన ద్వారా రావలసిన నిధులను కూడా వచ్చేలా చూడాలని ఆయన కోరారు. మళ్లీ ఏపీ ప్రభుత్వం న్యాయ సమీక్షకు వెళ్లకుండా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్రానికి సజ్జల రామకృష్ణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఆ పరిస్థితుల నుండి గట్టెక్కడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు పరిష్కారం కావాలి
ఏపీ సుభిక్షంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు పరిష్కారం కావాలని తాను శ్రీవారిని వేడుకున్నానని సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఇదే సమయంలో ఏపీకి ఎప్పటికీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉండాలని వేడుకున్నానని పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుంటే రెండున్నర సంవత్సరాల్లో ఏపీ అభివృద్ధి విషయంలో పరుగులు తీసేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు.