రాజధాని: భూసేకరణపై దృష్టి పెట్టిన చంద్రబాబు..!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ప్రకటించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ భూముల లభ్యత ఎంత? రైతుల నుండి ఎక్కడెక్కడ భూములు సేకరించాలనే అంశాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ నియమించిన రాజధాని భూసేకరణ కమిటీలోని రాష్ట్ర మంత్రులు యనమల రామక్రిష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమలు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజధాని భూసేకరణ అంశంపై ఏ విధానంతో ముందడుగు వేయాలని చర్చించారు.
రాజధాని కోసం ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, ప్రైవేటు భూమి ఎంత సేకరించాల్సి ఉంటుంది.. భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలు ఏంటీ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించినట్లు సమాచారం. రాజధాని కోసం రైతుల నుండి భూమిని సేకరించడంపై దృష్టిపెట్టాలని అన్నారు. అందుకుగాను రైతులకు అభివృద్ది చేసిన భూమిలో నలబై శాతం ఇవ్వడంతో పాటు, ఇతర రాయితీలు కూడా కల్పించేలా చూడాలన్నారు.
అభివృద్ది చేసిన భూమిలో వారికిచ్చే వాటాను రాజధాని ప్రక్కనున్న ఏ ప్రాంతంలో ఇవ్వాలనే విషయాలపై సమగ్రంగా దృష్టిపెట్టాలన్నారు. ఎకరా భూమిని అభివృద్ది చేస్తే రోడ్లు, ఇతర సౌకర్యాలు పోను ఎంత భూమి మిగులుతుందన్న దానిపై చర్చించారు. గుంటూరు-విజయవాడ మధ్య ప్రభుత్వ భూమి ఎంత ఉంది. ఇతర ప్రాంతాల్లో ఎంత ఉంది అనే అంశాలపైనా సమీక్షించారు. నెలరోజుల్లోపు రాజధానిపై మరింత స్పష్టమైన సమాచారం వస్తుందని మంత్రుల కమిటీ అంచనా వేసింది.