'జగతి'పై దర్యాఫ్తు పూర్తి: బాబుపై పోరాటం.. జగన్కు టీ లాయర్ల మద్దతు
హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో దర్యాఫ్తు పూర్తయిందని, ఈ కేసులో విచారణ చేపట్టాలని ఈడి బుధవారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, ఈడీ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాఫ్తు పూర్తి చేసి ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు ఈడి తెలిపింది.
సిబిఐ తరహాలోనే పలు ఫిర్యాదులు దాఖలు చేయనుందని, అందువల్ల ఈసీఐఆర్లోని ఆరోపణలకు సంబంధించి దర్యాఫ్తు ఏ స్థాయిలో ఉందో చెప్పేలా నివేదిక కోరాలని, అంతవరకు విచారణను నిలిపివేయాలని కోరుతూ రెండో నిందితుడు విజయ సాయిరెడ్డి వేసిన పిటిషన్ పైన మంగళవారం ఈడీ కౌంటర్ దాఖలు చేసింది.
తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ కేసు విచారణ సందర్భంగా జగన్, విజయ సాయి రెడ్డిలు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.
తప్పుడు హామీలు ఇచ్చి టిఆర్ కన్నన్, మాధవ్ చంద్రన్, ఎకె దండమూడిల నుంచి పెట్టుబడులను రాబట్టడంపై ఫిర్యాదు చేశామని ఈడి బుధవారం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి దర్యాఫ్తు పూర్తయిందని పేర్కొంది.
మనీలాండరింగ్ చట్టం వేరు, సీఆర్పీసీ వేరు అని, సిబిఐ పోలీసులు దాఖలు చేసే ఎఫ్ఐఆర్కు, మేము నమోదు చేసే ఈపీఐఆర్కు వ్యత్యాసం ఉందని, ఒకే ఛార్జీషీట్ ఎలా దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు.
జగతి పబ్లికేషన్లో మనీలాండరింగ్ రూపంలో పెట్టుబడులు ఉన్నాయని ఈడీ నమోదు చేసిన కేసు విచారణకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ ఆర్థిక నేరాల కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు జగతి ఆడిటర్, ఈ కేసులో రెండో నిందితుడు విజయ సాయి రెడ్డి కోర్టుకు వచ్చారు.
ఈ సందర్భంగా బయటకు వెళ్తున్న జగన్ను కొందరు తెలంగాణ న్యాయవాదులు పరిచయం చేసుకున్నారు. మేము మీకు సపోర్ట్ చేస్తామని, ఏపీ ప్రభుత్వంపై పోరాడాలని చెప్పారని తెలుస్తోంది. రిషికేశ్వరి కేసును నిలదీయాలని కోరారని తెలుస్తోంది.