క్లాస్రూమ్లో పాఠం చెప్తూనే కుప్పకూలిన టీచర్ మృతి.. ఏపీలో ఘటన
ఇటీవల కాలంలో మాట్లాడుతూనే కుప్పకూలిపోయి మృతి చెందుతున్న వారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గుండె ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రమాదాన్ని గుర్తించలేక మృత్యువు బారిన పడుతున్నారు. అప్పటి వరకూ బాగానే ఉన్నాడు. అంతలోనే ఏమైంది అని సదరు వ్యక్తులను చూసినవాళ్లు షాక్ కు గురవుతున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకుండా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు పెరుగుతున్న పరిస్థితులు మనుషుల గుండె ఆరోగ్యం పై ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇక అటువంటి విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని కెవిబిపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హరిబాబు యధావిధిగా పాఠశాలకు వచ్చారు. ఉపాధ్యాయులు అందరితోనూ బాగానే మాట్లాడారు. ఆపై క్లాస్ తీసుకోవడానికి తరగతి గదిలోకి వెళ్లారు. విద్యార్థులకు పాఠం చెబుతూ ఒక్కసారిగా హరిబాబు తరగతి గదిలోనే కుప్పకూలిపోయారు. దీంతో విద్యార్థులు పరుగున వెళ్లి పాఠశాలలోని ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో, అందరూ కలిసి ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించారు.

మార్గం మధ్యలోనే ఉపాధ్యాయుడు హరిబాబు కన్నుమూశారు. స్కూల్ లో పాఠం చెప్తూ ఉపాధ్యాయుడు మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఇక ఆసుపత్రి వైద్యులు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, దాంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు అని చెప్పారు. ఊహించని విషాదంతో స్కూల్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఊహించని ఈ హఠాత్పరిణామానికి స్కూల్ టీచర్ల తో సహా, విద్యార్థులు షాక్ తిన్నారు. తమకు అప్పటి దాకా క్లాస్ చెప్తున్న టీచర్ ఇక లేడని తెలిసి విద్యార్థులు బోరున విలపించారు.
గుండె ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్త వహించాలని, కచ్చితంగా గుండె ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలని గుండె వ్యాధుల నిపుణులు చెప్తున్నారు. ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ అయితే వెంటనే సీపీఆర్ చేసి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. సీపీఆర్ పై ప్రస్తుత కాలంలో అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం మరచిపొవద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications