హోదా కోసం అప్పుడు పట్టుబట్టాను, కానీ ఇప్పుడు ఏమీ చేయలేను: విశాఖలో వెంకయ్య
విశాఖపట్నం: తాను రాజ్యసభలో విపక్ష సభ్యుడిగా ఉన్న వేళ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన మాట వాస్తవమేనని, అయితే, ఇప్పుడు మాత్రం హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వెంకయ్య నాయుడు బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు.
ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బీచ్రోడ్డులోని ఎంపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి హోదా రప్పించే విషయంలో తానిప్పుడు ఏమీ చేయలేనని అన్న వెంకయ్యనాయుడు, అందుకు సమానమైన నిధులను మాత్రం ప్యాకేజీ రూపంలో విదేశాల నుంచి రుణం తీసుకుని ఇప్పిస్తానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను జోక్యం చేసుకున్నాకే ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారని అన్నారు.
ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన తెలిపారు. కేంద్రం అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తోందని చెప్పిన ఆయన ప్రత్యేకహోదాతో పోలిస్తే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతోనే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. విభజన సమయంలో ఏపీకి హోదాతో పాటు ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు కావాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చట్టంలో పేర్కొనకుండా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి అదిచేశాం, ఇదే చేశామని చెప్పుకుంటున్నారని అన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులు కేంద్రం నుంచి వస్తాయని చెప్పిన ఆయన నిధులున్నంత మాత్రాన అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఖర్చు చేయాల్సి వుంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని గుర్తు చేసిన ఆయన, తేడాగా ఉన్న 30 శాతం నిధులు ఎంతయినా కేంద్రం ఇస్తుందని అన్నారు. ఏపీకి ఐదేళ్ల పాటు ఆర్ధిక లోటును కేంద్రమే భరిస్తుందని ఆయన చెప్పారు.
ప్రత్యేకహోదాకి పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని అందుకే దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగిందని, వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తోంది చెప్పారు. ఏపీ అభివద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి ఎంపీ హరిబాబుతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
Addressing huge gathering of People, Party workers, Followers and Well wishers at MP's office in Vishakhapatnam.. pic.twitter.com/PSfNinFZ1A
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 14, 2016
Overwhelmed by the reception of people/ party workers at Vizag airport... Going to MP's office in a rally.. pic.twitter.com/xBjVe2L0ql
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 14, 2016
పెందుర్తి రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత
రాయగడ-విజయవాడ ఫాస్ట్ పాసింజర్ రైలును విశాఖపట్టణంలోని పెందుర్తి రైల్వే స్టేషన్లో అఖిల పక్షం నేతలు అడ్డుకున్నారు. విశాఖపట్టణానికి రైల్వే జోన్ను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఆందోళనలు పెరుగుతున్నాయి.
అందులో భాగంగా అఖిలపక్షం నేతలు పెందుర్తి రైల్వే స్టేషన్లో అఖిల పక్షం నేతలు రైలుని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వారు ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.