రైలు ప్రమాదం అక్కడ జరిగుంటే ఊహించని ప్రాణనష్టం?(పిక్చర్స్)
విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికే 42మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం కొంత దూరం వెళ్లిన తర్వాత జరిగితే మాత్రం మృతుల సంఖ్య భారీగా ఉండేది.
విజయనగరం: జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికే 42మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం కొంత దూరం వెళ్లిన తర్వాత జరిగితే మాత్రం మృతుల సంఖ్య భారీగా ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన భారీ ప్రమాదం ఇదే అయినప్పటికీ పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి.
వేగంగా స్పందించారు
రైలు పట్టాలు తప్పిన ప్రాంతం కూనేరు రైల్వేస్టేషన్కి పక్కనే ఉంది. అక్కడకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం బాగానే ఉంది. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అధికారులు హుటాహుటిన రావడానికి, సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి అవకాశం ఏర్పడింది.
గంటలోపే చేరుకున్నారు..
కొమరాడ మండలం కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన వెంటనే కొమరాడ ఏపీఎస్పీ, రాయగడ సీఆర్పీఎఫ్ ప్రత్యేక బలగాలు, రైల్వే పోలీసులు కేవలం గంటలోపే చేరుకున్నారు.
కలిసొచ్చిన రవాణా సౌకర్యాలు..
రాయగడ, పార్వతీపురం ప్రాంతాలు రెండూ దాదాపు కేవలం 24 కి.మీ. దూరంలోనే ఉండడం, రోడ్డు సౌకర్యం బాగుండడంతో అక్కడకి చేరుకోవడానికి ఎవరికీ ఎలాంటి అసౌకర్యం ఎదురుకాలేదు. ఘటనాస్థలి కూనేరు రైల్వేస్టేషన్కి ఆనుకునే ఉండడమూ కలిసొచ్చింది.
అక్కడ జరిగుంటే..
రాయగడ నుంచి కూనేరు మధ్యలో దాదాపుగా అంతా అటవీ ప్రాంతమే.. పైగా లడ్డా, జిమిడిపేట అనే రెండు స్టేషన్లే ఉన్నాయి.. అవీ చిన్నవే..ప్రమాదం జరిగిన కూనేరు రైల్వేస్టేషన్కు కిలోమీటరు ముందు ఒడిశా నుంచి ప్రవహించే గెడ్డ ఉంది. దానిపై రైల్వే వంతెన ఉంది. దానికంటే ఇంకాస్త ముందు సులవ గ్రామ పరిధిలో దాదాపు 2 కి.మీ. మేర మరో వంతెన ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా నష్టం అపారంగా ఉండేదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కష్ట సాధ్యమే...
రాయగడ నుంచి రైలు ప్రయాణించే దారిలో లోతట్టు ప్రాంతాలే అధికమని, కనీసం 40 అడుగుల లోతు పైనే ఉంటుందని చెబుతున్నారు. అక్కడ ప్రమాదం జరిగితే చేరుకోవడం, సహాయక చర్యలు కష్టసాధ్యమంటున్నారు.
భారీ నష్టం తప్పింది..
రాయగడ, కూనేరు మధ్యలో లడ్డా, జిమిడిపేట స్టేషన్లకు మినహా ఇంకెక్కడా రోడ్డు సౌకర్యం లేదు. అందుకే మధ్యలో ఎక్కడ ప్రమాదం జరిగినా నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమని, 24 బోగీలకూ ముప్పేనని రైల్వే అధికారులు తెలిపారు.