బాబుకు 'టి' తలనొప్పి: సీట్ల కోసం అలకలు, బెదిరింపులు
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమంగా పుంజుకోవడమే కాకుండా... భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో కొత్త ఊపులో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తలపోటు ప్రారంభమైందంటున్నారు. అలకలు, బెదిరింపులతో తెలంగాణ ప్రాంత నేతలు కొందరు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు.
తెలంగాణలో నామినేషన్ల గడువు దాఖలు సమయం దగ్గర పడటంతో ఆయనపై నేతల ఒత్తిడి అధికమైంది. చంద్రబాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు తాజాగా తిరుగుబాటు జాబితాలో చేరారు. చంద్రబాబుకు సన్నిహితునిగా ముద్రపడిన ఆయన కూడా ఇప్పుడు ధ్వజం ఎత్తడం విశేషం.
ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తన నియోజకవర్గ మార్పు కోరడం నామా ఆగ్రహానికి కారణమైంది. ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మల.. ఈసారి దాని పక్కనే ఉన్న పాలేరు నుంచి పోటీ చేయాలని అనుకొంటున్నారు. చంద్రబాబును ఆయన ఇటీవల కలిసి అనుమతి కోరితే.. బాబు అంగీకరించారని సమాచారం. నామా మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు.
చంద్రబాబు
తుమ్మలను ఖమ్మంలోనే కొనసాగించాలని, పాలేరు సీటు తన వర్గానికి చెందిన ప్రస్తుత పార్టీ ఇంచార్జి స్వర్ణ కుమారికే ఇవ్వాలని బాబుపై ఒత్తిడి తెచ్చారు. తన వాదన వినిపించడానికే పరిమితం కాకుండా తుమ్మల సీటు మార్చేటట్లయితే తాను ఎంపీ సీటుకు పోటీ చేసేది లేదని, అసలు ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనని చంద్రబాబుకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తుమ్మల కూడా అదే స్థాయిలో స్పందించారు. నామా పోటీ చేయకపోతే తాను ఎంపీ సీటుకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఎంపీ సీటుతోపాటు మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించి తీసుకువస్తానని ఆయన చంద్రబాబుకు చెప్పారట.
రేవంత్ రెడ్డి
మల్కాజిగిరి లోకసభ సీటుకు పోటీ చేయాలని అనుకొంటున్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా వేడి రాజేశారు. శుక్రవారం రాత్రి ఇక్కడ పార్టీ అధినేతను కలిసిన ఆయన తనకు మల్కాజిగిరి సీటు ఇవ్వకపోతే ఎన్నికల్లో అసలు పోటీచేయబోనని, పార్టీలో కూడా ఉండనని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎర్రబెల్లి - రేవంత్
శనివారం ఉదయం రేవంత్.. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఇంటికి వెళ్ళి ఆయనను తీసుకొని చంద్రబాబు నివాసానికి వచ్చారు. తన సీటు కోసం ఎర్రబెల్లితో చెప్పించే ప్రయత్నంలో ఉన్నారట. ఏదైనా కారణం వల్ల ఆ సీటు కుదరకపోతే చేవెళ్ళ లోకసభ సీటైనా తనకు ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారట.
మోత్కుపల్లి నర్సింహులు
మరో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా లోకసభ సీటు కోసం చంద్రబాబుపై గట్టి ఒత్తిడి తెస్తున్నారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు కాబట్టి లోకసభ సీటు ఇవ్వాలన్నది ఆయన కోరిక. మల్కాజిగిరి లోకసభ సీటు తనకు ఇవ్వాలని, లేని పక్షంలో నాగర్ కర్నూలు లోకసభ సీటైనా ఇవ్వాలని ఆయన కోరుతున్నారట.