మే 16నే ఫలితాలు: జూన్ 2 తర్వాత వేర్వేరు ప్రభుత్వాలే
న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణలో, మే 7వ తేదీన సీమాంధ్రలో పోలింగ్ జరుగతుంది. మే 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువుదీరే అవకాశం లేదు. జూన్ 2వ తేదీ తర్వాత రెండు అసెంబ్లీలు కొలువు దీరుతాయని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన అధికారికంగా జరగకపోయినప్పటికీ ఎన్నికల కమిషన్ సాంకేతికంగా విడదీసింది. విడివిడిగానే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఫలితాలు వెలువడిన వెంటనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ ఓ తెలుగు మీడియా సంస్థ ప్రతినిధితో చెప్పారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుంది. దీంతో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (సీమాంధ్ర) వేరయిపోతుంది. దీనివల్ల జూన్ 2వ తేదీ తర్వాత రెండు ప్రభుత్వాలు ఏర్పడుతాయి. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంటుంది.
అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎన్నికల షెడ్యూల్ అటంకంగా మారే అవకాశం లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతితో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో 17 లోకసభ స్థానాలు, 119 శాసనసభా స్థానాలున్నాయి. సీమాంధ్రలో 25 లోకసభ స్థానాలు, 175 శాసనసభా స్థానాలున్నాయి. సాంకేతికంగా విడివిడి రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరుగుతున్న వాతావరణం ఏర్పడుతుంది.