కుక్క తోక వంకరలా మీరు!.., కాదు బురదలో దొర్లిన పందుల్లా మీరే: కొడాలి-గోరంట్ల 'వార్'
'కుక్క తోక వంకరలా..' ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనడంతో సభలో మరింత దుమారం రేగింది.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ ఆసాంతం గందరగోళంగానే నడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం సభ ప్రారంభమై ఒక దఫా వాయిదాపడ్డ తర్వాత.. టీడీపీ ఎమ్మెల్యే అనిత, గిడ్డి ఈశ్వరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. వైసీపీ ఆందోళనల మధ్య సభ మరోమారు వాయిదా పడింది.
అనంతరం ప్రారంభమైనా ఇరుపక్షాల మధ్య మాటల యుద్దం మాత్రం ఆగలేదు. జగన్ ఆస్తులపై ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతున్న వేళ.. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీని ఎద్దేవా చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. 'కుక్క తోక వంకరలా..' ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనడంతో సభలో మరింత దుమారం రేగింది. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. అధికార పార్టీ సభ్యులు బురదలో దొర్లిన పందుల్లా వ్యవహరిస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
దీంతో అధికార పార్టీ సభ్యులు కొడాలి నాని వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో కల్పించుకున్న స్పీకర్.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరారు. స్పీకర్ ఆదేశంతో కొడాలి నాని స్పందిస్తూ..'అధ్యక్షా.. నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు.. ఆయన మమ్మల్ని కుక్క తోక వంకర అని అంటే, నేను.. మీరు బురదలో దొర్లిన పందుల్లా వ్యవహరిస్తున్నారని అన్నాను. దీనికి ఆయన బాధపడి ఉంటే నా వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకుంటా. ఆయన్ను కూడా విత్ డ్రా చేసుకోమనండి' అని చెప్పుకొచ్చారు.