జగన్ను తిట్టిపోస్తున్న జలీల్ ఖాన్: దాని వెనక కథేమిటి?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అందరికన్నా ఎక్కువగా వైయస్ జగన్ను తిట్టిపోస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టిడిపిలో చేరిన శాసనసభ్యుల్లో ఎక్కువగా జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నది ఆయనే.
ఆ తర్వాత భూమా నాగిరెడ్డి వస్తారు. ఆయన అడపాదడపా మాత్రమే జగన్ను విమర్శిస్తున్నారు. జలీల్ ఖాన్ జగన్పై విరుచుకుపడడం వెనక కారణం లేకపోలేదని అంటున్నారు. జలీల్ ఖాన్ అలా విమర్శిస్తుండడంపై జగన్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు కూడా చెబుతున్నారు. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించడమే తన పాపమైందని జగన్ మనస్తాపం చెందినట్లు చెబుతున్నారు.
అయితే, పార్టీలో తగిన స్థానం కల్పిస్తానని జగన్ జలీల్ ఖాన్కు హామీ ఇచ్చారని, అయితే గెలిచిన తర్వాత తనను జగన్ పట్టించుకోవడం లేదని జలీల్ ఖాన్ మనసులో పెట్టుకున్నారని అంటున్నారు. అందుకే జగన్పై తీవ్రంగా మండిపడుతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టిని ఆకర్షించి, మైనారిటీ కోటాలో మంత్రి పదవిని కొట్టేయాలనే ఉద్దేశం కూడా జలీల్ ఖాన్కు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు వైయస్ జగన్ పార్టీ నుంచి 17 మంది శాసనసభ్యులు టిడిపిలోకి వలస వెళ్లారు. రేపో మాపో మరో ఇద్దరు శానససభ్యులు కూడా టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు ఇటీవల జగన్ ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలనేది ఆ సవాల్.
జగన్ చేసిన ఆ వ్యాఖ్యలపై అందరి కంటే ముందుగా జలీల్ ఖాన్ స్పందించారు. తాను పోటీ చేసి గెలిస్తే వైసీపీని మూసేయడానికి సిద్ధమా అంటూ జలీల్ జగన్కు ప్రతి సవాల్ విసిరారు. రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని పోటీకి దించాలనే టిడిపి ఆలోచన విషయంలో కూడా జలీల్ ఖాన్ జగన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications