బాబు వ్యాఖ్యలు ఏపీలో బూంరాంగ్ అవుతాయా..? వైసీపీకి అస్త్రం చిక్కినట్లేనా
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో ఆరురోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇటు ప్రాంతీయపార్టీల అగ్రనాయకులు అటు జాతీయ పార్టీల నేతలు వరుసగా ప్రచారాలతో బిజీగా గడుపుతున్నారు. ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు అస్త్రాలు విమర్శనాస్త్రాలు వినియోగిస్తున్నారు. ఒకరి అభివృద్ధి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. అధికారంలోకి వస్తే తాము ఏమి చేస్తామో అని విపక్ష పార్టీలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుండగా... అధికార పార్టీ మాత్రం తమ అభివృద్ధి గురించి చెబుతూ ముందుకు సాగుతోంది. ఇక తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు ఎంట్రీతో ఇక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి.
వైయస్ చేసిన అభివృద్ధిని చంద్రబాబు ఒప్పుకుంటున్నారా..?
తెలంగాణలో చంద్రబాబు ప్రజాకూటమి తరుపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకప్పటి బద్ద శత్రువు కాంగ్రెస్తో దోస్తీ కట్టిన చంద్రబాబు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఒకే వేదిక పంచుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రచారంను కొంత నిశితంగా పరిశీలిస్తే ఒకప్పటి తన బద్ధశత్రువు రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఒప్పకున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 9 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న తను హైదరాబాద్ను నిర్మించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు తీసుకొచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నాడు. అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను అభివృద్ధి చేసిందని బాబు పదేపదే చెబుతున్నారు. అంటే తెలుగుదేశం 2004లో ఘోర ఓటమి చవిచూశాకా అఖండ మెజార్టీతో వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత అత్యధిక కాలం సీఎంగా వైయస్
2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. వైయస్ అకాల మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కష్టాల ఊబిలో చిక్కుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కారణం అప్పుడే తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అభివృద్ధి ఆగిపోయిందనేది వాస్తవమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు గద్దె దిగిన తర్వాత తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే అందుకు కారణం ఐదున్నరేళ్లు సీఎంగా పనిచేసిన వైయస్ రాజశేఖర రెడ్డికే ఆ ఘనత దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు.
వైయస్ పేరు ప్రస్తావిస్తే ఏపీలో తనకు డ్యామేజీ తప్పదని ఊహించిన చంద్రబాబు..?
తెలంగాణలో ప్రజాకూటమిలో భాగంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఎక్కడా వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించడం లేదు. ఎందుకంటే ఒకవేళ రాజశేఖర రెడ్డి పేరు ఇక్కడ చెప్పాల్సి వస్తే ఏపీలో వైసీపీకి అస్త్రం ఇచ్చినట్లే అవుతుందని బాబు ముందే ఊహించి ప్రచారంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైయస్ అభివృద్ధి ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ లాంటి పథకాల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా వైయస్ పేరు చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు అలా చెప్పకుండా తెలివిగా కాంగ్రెస్ అభివృద్ధి చేసిందంటూ ప్రచారంలో చెప్పుకొస్తున్నారు. ఒకవేళ వైయస్ పేరు బాబు నోట వస్తే కచ్చితంగా అతనికి ఆంధ్రలో నష్టం చేకూరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టడం ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా వైయస్ పేరును ప్రస్తావించేందుకు జంకుతున్నారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం మాట్లాడిన జైరాం రమేష్ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టారని చెబుతున్నారే కానీ... వైయస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని చెప్పలేకున్నారు. అంటే ఒకవేళ వైయస్ పేరును ఇక్కడ ప్రస్తావిస్తే ఏపీలో అది వైసీపీకి మేలుచేకూరుతుందనే ముందస్తు ఆలోచనతో ఎక్కడా వైయస్ పేరును ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చిన్న లాజిక్ మిస్ అయిన చంద్రబాబు
ఇక చంద్రబాబు ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, పీవీ ఎక్స్ప్రెస్ వేలు తన హయాంలో వచ్చాయని బాబు చెప్పడాన్ని సీనియర్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. వాస్తవానికి అవన్నీ వైయస్ హయాంలోనే కంప్లీట్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. నాడు బాబు శంకుస్థాపన చేసి ఉండొచ్చుగానీ... వైయస్ అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్టును సోనియాగాంధీ చేతులమీదుగా ప్రారంభింపజేశారు. అంతేకాదు ఒకవేళ నిజంగానే చంద్రబాబు హయాంలో పూర్తి అయి ఉంటే వాటికి తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు పెట్టేవారని కానీ వీటన్నిటికీ కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టారంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చని రాజకీయ మేధావులు చెబుతున్నారు. ఉదాహరణకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో పీవీ ఎక్స్ప్రెస్ వే.. ఇవన్నీ కాంగ్రెస్ నాయకుల పేర్లే అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డు పై బాబు వైయస్ సర్కార్పై విమర్శలు గుప్పించారని కూడా నాటి జర్నలిస్టులు గుర్తుచేస్తున్నారు.
తెలంగాణలో ప్రజాకూటమికి వ్యతిరేక ఫలితాలు వస్తే బాబు పరిస్థితేంటి..?
తెలంగాణలో ప్రజాకూటమికి అనుకూల ఫలితాలు వస్తే చంద్రబాబుకు జాతీయ స్థాయిలో పాటు ఏపీలో కూడా పరపతి పెరుగుతుందని రాజీకీయ నిపుణులు చెబుతున్నారు.... అదే వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు కచ్చితంగా ఆత్మరక్షణలో పడిపోతారని చెబుతున్నారు. అదే జరిగితే ఏపీలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై కూడా అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి తరుపును ప్రచారం చేస్తున్న చంద్రబాబు వైయస్ పేరును ప్రస్తావించకపోవడంపై ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా ఏపీలో చూపుతుందని తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏపీ ఓటరు నిశితంగా పరిశీలిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.