ఏడాది క్రితం మహిళ శవాన్ని పూడ్చిపెట్టారు, తవ్వితీసి మిస్టరీ ఛేదించారు
అనంతపురం: ఏడాది కాలంగా మిస్టరీగా మిగిలిపోయిన న్యాయవాది ఎర్రిస్వామి భార్య సుజాత మిస్సింగ్ కేసు చిక్కుముడి దాదాపు వీడిపోయినట్లేనని ఎస్పీ ఎస్వి రాజశేఖరబాబు చెప్పారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ఆ వివరాలు వెల్లడించారు.
గుర్తు తెలియని శవంగా భావించి పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని మంగళవారం తహశీల్దార్ సమక్షంలో వెలికితీసి వైద్య నిపుణుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించిందన్నారు. మృతదేహం ఎముకలు, ఎముకల మజ్జ సేకరించి డిఎన్ఎ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామన్నారు. ఇప్పటివరకూ పోలీసులకు లభ్యమైన మెడికల్, ఇతర ఆధారాలు, సేకరించిన ఆనవాళ్లను బట్టి ఆమె రైలు కింద పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి - కళ్యాణదుర్గం మండలం తిమ్మగానిపల్లికి చెందిన ఎర్రిస్వామి న్యాయవాద వృత్తి చేపట్టి నగరంలో నివసిస్తున్నాడు. ఇతడికి 14 సంవత్సరాల క్రితం కంబదూరు మండలం మరిమేకలపల్లి గ్రామానికి చెందిన సుజాతతో వివాహమైంది. అయితే భా ర్యభర్తలు తరచూ గొడవ పడేవారు. దీంతో భర్తకు తెలియకుండా ఆమె ఇళ్లు వదిలి పుట్టింటికి వెళ్లింది. ఆక్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ నుంచి ఆమె కనపడకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి బోయ చిన్నవీరన్న నవంబర్ 26వ తేదీ కంబదూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు న్యాయవాది ఎర్రిస్వామి కూడా తన భార్య మిస్సింగ్ కేసులో కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నగర టూ టౌన్ పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో టూ టౌన్ పోలీసులు నేషనల్ పార్కు సమీపంలో లభించిన మహిళ శవానికి, సుజాత ఫొటోలకు పోల్చి చూస్తూ అదే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో రైలు పట్టాలపై లభించిన మహిళ మృతదేహం సుజాతదేనని అభిప్రాయానికి వచ్చారు.
ఆమె రక్త సంబంధీకులు కూడా ఆ ఆనవాళ్లను పరిశీలించాక అది సుజాత శవమేనని తేల్చారన్నారు. ఈ కేసు ఇంతటితో ముగియలేదని, ఇంకా సమగ్ర దర్యాప్తు చేపట్టి ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. సమావేశంలో అనంతపురం నగర డీఎస్పీ మల్లికార్జునవర్మ, టూ టౌన్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్, ఎస్ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.