ప్రధాని మోడీతో గంటపాటుప్రధానమంత్రి నరేంద్రమోడీ జగన్ చర్చలు- పోలవరం, ఆర్ధిక సాయం, ప్రాజెక్టుల అనుమతులకు వినతులు
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎంవైఎస్ జగన్ ఇవాళ భేటీ అయ్యారు ఢిల్లీ టూర్ లో భాగంగా ప్రధాని నివాసానికి వెళ్లిన జగన్.. ఆయనతో గంటపాటు చర్చలు జరిపారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్ సమస్యలు చర్చకు వచ్చాయి. ఈ మేరకు సీఎం జగన్ ఓ వినతి పత్రాన్ని సైతం ప్రధానికి అందజేశారు. ప్రధానితో భేటీ తర్వాత పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ప్రధానితో జగన్ భేటీలో మొత్తం ఏడు అంశాలపై ఈ చర్చలు జరిగాయని సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది.
పోలవరం ప్రాజెక్టుపై
పోలవరం ప్రాజెక్టుకు తాజా డీపీఆర్ ప్రకారం నిధులు విడుదల చేయాలని ప్రధాని మోడీని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ భాగానికి మాత్రమే మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్ కాగా, రెండోది విద్యుత్ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. ఈ విషయలలో మీరు జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని జగన్ ప్రధానిని కోరారు.. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలని, అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2100 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.
రెవెన్యూ లోటుపై
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రెవిన్యూ లోటును పూడుస్తామంటూ మాజీ ప్రధాని గతంలో రాజ్యసభలో హామీ ఇచ్చారని జగన్ ప్రధానికి గుర్తుచేశారు. రాష్టర విభజన జరిగిన 2014 జూన్ నుంచి మార్చి 31, 2015 వరకూ ఉన్న నిధుల గ్యాప్ మొత్తం రూ.16,078.76 కోట్లని కాగ్ నిర్ధారించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం (స్టాండరై్డజ్డ్ ఎక్స్పెండేచర్) పేరిట కొత్త పద్ధతిని తీసుకు వచ్చింది. రీసోర్స్ గ్యాప్ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. దీంతో నిధుల కొరత వల్ల 2014-15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులను, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 2014-15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణలోకి తీసుకుంటే రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే. చాలా కాలంగా పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు.
తెలంగాణ నుంచి విద్యుత్ బిల్లులు
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు విద్యుత్ను అందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్దిష్ట ఆదేశాల మేరకు ఆ విద్యుత్ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. కాని ఇప్పటివరూ ఎలాంటి చెల్లింపులు చేయలేదని ప్రధాని మోడీకి జగన్ తెలిపారు. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని మోడీని జగన్ కోరారు. దీని వల్ల ఏపీ విద్యుత్ సంస్థలు బలపడతాయన్నారు. బిల్లుల చెల్లింపులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయన్నారు.
పీడీఎస్ అమల్లో ఇబ్బందులపై
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేని విధానం వల్ల ఏపీ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఏపీలో లబ్ధిదారుల సంఖ్య 2.68 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 61 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో 41 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ గణాంకాలను చూస్తే జాతీయ స్థాయిలో సగటు లబ్ధిదారుల్లో గ్రామీణ ప్రాంత జనాభాలో 75 శాతం మంది, పట్టణ ప్రాంత జనాభాలో 50 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆర్థికంగా గణనీయ ప్రగతి సాధించిన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పీడీఎస్ లబ్ధిదారులు ఏపీలో కన్నా కనీసం 10 శాతం ఎక్కువగా ఉన్నారు. అర్హత ఉన్న చాలా మంది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కవర్ కావడం లేదు. అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోందని ప్రధానికి జగన్ తెలిపారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఆ మేరకు ఎక్కువ మంది లబ్ధిదారులు కవర్ అయ్యేలా చూడాలని జగన్ కోరారు.
కేంద్రం నుంచి నిధుల రాకపై
2019-2020లో ఆర్థిక మందగమనం ఏపీపై ప్రభావం చూపిందని జగన్ ప్రధానికి గుర్తుచేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.34,833 కోట్లు అయితే వాస్తవంగా వచ్చింది రూ.28,242 కోట్లు మాత్రమేనన్నారు. 2020-21లో కోవిడ్ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీశాయని, కేంద్ర పన్నుల్లో రూ.7.780 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రం ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయని తెలిపారు. దీంతోపాటు కోవిడ్ నివారణా చర్యల కోసం దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వీటితోపాటు రాష్ట్ర ప్రజలు నష్టపోయిన ఆదాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం వేల కోట్లలో ఉంటుందన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల (డీబీటీ) ద్వారానే జీవనోపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకున్నట్లు తెలిపారు. కాబట్టి కేంద్రం నిధులిచ్చి ఆదుకోవాలని జగన్ కోరారు.
అప్పులకు వెసులుబాటు
2021-22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితిని రూ. 42,472 కోట్లుగా నిర్ధారించినా తర్వాత ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గించిందని జగన్ ప్రధానికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని ఆమేరకు నిర్దేశించిన రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్టుగా పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండానే ఈ విధంగా రుణ పరిమితిలో కోత విధంచడం సరి కాదని ప్రధానికి జగన్ వెల్లడించారు.. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. మేం తీసుకుంటున్నవి అప్పులే కాని, గ్రాంట్లు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నామన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని 2021-22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఎన్బీసీని రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు.
Recommended Video
రాష్ట్రంలో ప్రాజెక్టులకు సాయం
రాష్ట్రంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ను రెన్యువల్ చేయాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. అలాగే కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థచే వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని కూడా కోరారు. అలాగే ఈ ప్లాంట్ కు అవసరమైన గనులు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేటాయించాలని కేంద్ర గనుల శాఖకు విజ్ఞప్తి చేశామని ప్రధానికి తెలిపారు. ఇందులో వేలం లేకుండా గనుల్ని తమకు కేటాయించి ఆదుకోవాలని జగన్ ప్రధానిని కోరారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా ఎస్బీఐ క్యాప్స్ను నియమించామని ప్రధానికి జగన్ తెలిపారు. ఎస్బీఐ క్యాప్ ఎస్సార్ స్టీల్స్ను కాపంటేటివ్ బిడ్డర్గా ఎంపిక చేసిందని, రుణం మంజూరుకు ఎస్బీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపిందన్నారు. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా ముగిసేలా చేయగలగడం ద్వారా రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు.