కాంగ్రెస్ ఆఫీస్పై జగన్ పార్టీ దాడి, మోదుగులపై ఫ్లెక్సీలు
గుంటూరు/అనంతపురం: లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యాలయం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా కార్యకర్తలు దాడి చేశారు. వారు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సోనియా గాంధీకి, కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా నినాదాలు చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు సమైక్య సెగ తలిగింది. సిపిఐ రాష్ట్ర విభజనపై తమ వైఖరిని మార్చుకోవాలని సమైక్యవాదులు హితవు పలికారు.
గుంటూరులో మోదుగులకు ఫ్లెక్సీలు
లోకసభలో తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విభజన బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేయడాన్ని పొగుడుతూ గుంటూరులో ఆయనకు అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిశాయి. పార్లమెంటు వేదికగా కాంగీయుల తెంపరితనం, దాడులతో తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినదని ఫ్లెక్సీలు వెలిశాయి.
కేంద్రమంత్రి జెడి శీలంకు కృష్ణా జిల్లాలో సమైక్య సెగ తగిలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... కాకినాడలో బిజెపి విభజన వృక్షం నాటిందని మండిపడ్డారు. కాంగ్రెసు మొదటి నుండి ఒకే మాటతో ఉందన్నారు. ఎన్ని పార్టీలు మాట మార్చినా కాంగ్రెసు పార్టీ వైఖరి మారలేదన్నారు. బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టారా లేదా అనేది స్పీకర్ నిర్ణయిస్తారని, వచ్చే మూడు రోజుల లోకసభ చాలా కీలకమన్నారు.