నిధుల కొరత, విభేదాలు: నెల్లూరు జిల్లా జగన్ పార్టీ ఆఫీస్ మూసివేత
నెల్లూరు: జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత ముదిరి ఏకంగా పార్టీ కార్యాలయం మూతపడింది. నాయకుల మధ్య విభేదాలు, ఆర్థిక ఇబ్బందులతో నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాన్ని మూసివేశారు. జిల్లాలో రెండు ప్రధాన వర్గాల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.
కాగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం ఖాళీ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ కార్యాలయ నిర్వహణ ఖర్చును ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భరిస్తామని మొదట హామీ ఇచ్చి, ఆ తర్వాత స్పందించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లా పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికి అద్దె రూ.40వేలు, సిబ్బంది, విద్యుత్ తదితర ఖర్చులన్నీ కలుపుకుంటే నెలకు రూ.1 లక్ష అవసరం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేటప్పుడే ప్రసన్న తన ఆర్థిక పరిస్థితిని జగన్కు వివరించినట్లు తెలిసింది. ఆ సర్దుబాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం, కొద్దిరోజులుగా అది కార్యరూపం ల్చకపోవడంతో అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే విషయాన్ని కొందరు పార్టీ నేతల దృష్టికి తీసుకుపోగా, ఇంటి యజమాని అవసరం ఉందని ఒత్తిడి చేయడంతో ఖాళీ చేసినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ప్రసన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.
దీంతో నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా కొనసాగాల్సిందేనని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. కాగా, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రసన్న ఖాళీ చేసి సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ కార్యాలయం రాజన్న భవన్కు ఫర్నిచర్ను తరలించారు.