రాజధానిపై బాంబు పేల్చిన నారా లోకేశ్.. అవనిగడ్డ అయితే ఓకే.. విశాఖ ప్రజలు అడగట్లేదుగా..
'రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి'.. 'సవ్ అమరావతి'.. పేరుతో చేపట్టిన దీక్షా శిబిరం సాక్షిగా టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై గందరగోళం నెలకొన్నవేళ.. లోకేశ్ అనూహ్యంగా 'అవనిగడ్డ' పేరును తెరపైకి తెచ్చారు. రాజధానిని అమరావతిలో కాకుండా కృష్ణా జిల్లాలోనే అవనిగడ్డలో ఏర్పాటుచేస్తానని సీఎం జగన్ ప్రకటిస్తే.. దానికి టీడీపీతోపాటు రాష్ట్ర ప్రజలెవరూ అభ్యంతరం చెప్పబోరని అన్నారు.

విశాఖ వాసులు కోరలేదే..
విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన 24 గంటల నిరసన ముగియడంతో.. లోకేశ్ నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. ఈ సదర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించాలని ఆ ప్రాంతవాసులు ఏరోజూ డిమాండ్ చేయలేదని, కనీసం రాజధాని రావాలని కోరుకోనూలేదని, అలాంటప్పుడు సీఎం జగన్ రాజధాని మార్పుపై ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావట్లేదని లోకేశ్ వాపోయారు. రాజధాని రాబోతోందని తెలిసిన తర్వాత విశాఖ ప్రజలు భయంతో వణికిపోతున్నారని, వైసీపీ భూకబ్జాదారులు ఎంటరైతే బతుకులు ఆగమైపోతాయేమోననే కంగారు విశాఖవాసుల్లో నెలకొందని చెప్పారు.

రాయలసీమ మారే చాన్సేలేదు..
మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన నారా లోకేశ్.. జ్యూడీషియల్ క్యాపిటల్ పేరుతో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ బాగుపడే అవకాశమే లేదని, ఈ విషయం అక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే జగన్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

ఒక్క అద్దమైనా పగిలిందా? పూలతొట్టి విరిగిందా?
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్న టీడీపీ మంగళవారం రాస్తా రోకోలకు పిలుపునిచ్చింది. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఏపీ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై ఆందోళనకారులు దాడిచేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, పిన్నెల్లిపై దాడిని టీడీపీ నేత లోకేశ్ పరోక్షంగా సమర్థించారు. ‘‘21 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఒక్క అద్దమైనా పగిలిందా? పూలతొట్టి విరిగిందా? కొన్ని రోజుల కిందట చంద్రబాబు అమరావతికి వెళ్లినప్పుడు.. కొంతమంది రాళ్లు రువ్వితే దాన్ని శాంతియుత నిరసనగా పోలీసులు చెప్పారే.. మరి ఇవాళ జరిగినదాన్ని మాత్రం దాడిగా చిత్రీకరించడమేంటి?''అని లోకేశ్ ప్రశ్నించారు.

ఇసుక దొరకట్లేదు.. కరెంటు రావట్లేదు..
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందన్న లోకేశ్.. ఇప్పటికీ ఎక్కడా ఇసుక దొకట్లేదని, కరెంటు రావట్లేదని, పెన్షన్లు అందడంలేదని, రైతులకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని.. ఈ సమస్యల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే సీఎం జగన్... కులం, మతం, ప్రాంతాల చిచ్చులు పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications