పోలింగ్ నాడు అందరికి సెలవు.. తేల్చి చెప్పిన ఈసీ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 7న సెలవు ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఆ రోజు హాలిడే ఇవ్వాలని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు పోలింగ్ తేదీనాడు సెలవు ప్రకటించలేదు. దీంతో ఆయా సంస్థల ఉద్యోగులు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈమేరకు స్పందించిన ఈసీ ప్రధానాధికారి రజత్ కుమార్ డిసెంబర్ 7న సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. లేబర్ డిపార్టుమెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కంపెనీలు, సంస్థలు ఓటింగ్ నాడు సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే లేబర్ లా ప్రకారం చట్టపర్యమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇదివరకే డిసెంబర్ 7న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేతనంతో కూడిన హాలిడే మంజూరు చేయాలని సూచించింది.