గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి.. ఇవీ సమీకరణాలు, ఇలా లెక్క.. అంత వీజీ కాదు
జీహెచ్ఎంసీ మేయర్ సీటు కోసం పలువురి పేర్లు వినిపించాయి. భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అల్లాపూర్ కార్పొరేటర్ సహిబా బేగం పేర్లు తెరపైకి వచ్చాయి. మేయర్ తమ కార్పొరేటర్ అని సోషల్ మీడియాలో ఎవరికి వారు ప్రచారం చేశారు. కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పీఠాన్ని గులాబీ బాస్ అప్పగించడం చాలా తంతంగం నడిచింది.
ఫోటోలు: జీహెచ్ఎంసీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మీ
ఉద్యమ సమయం నుంచి వెన్నంటే..
ఉద్యమ సమయంలో కేకే కాంగ్రెస్లో ఉన్నారు. 2013లో కాంగ్రెస్ పార్టీని వీడి కేకే టీఆర్ఎస్లో చేరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా గులాబీ గూటికి చేరారు. 2014లో సీఎం కేసీఆర్ కేకేను రాజ్యసభకు పంపించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా కేకేకు బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ హోదాలో ఆయన కొనసాగుతున్నారు. మరోవైపు కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి రెండోసారి బంజారాహిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు.
2016లో అతిపెద్ద పార్టీగా అవతరించి..
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఆ సమయంలో కేకే కూతురు విజయలక్ష్మికి మేయర్ పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ విజయలక్ష్మిని మేయర్ చేసే ప్రయత్నాలు జరిగినా.. చివరి నిమిషంలో బొంతు రామ్మోహన్కు మేయర్ పదవి కట్టబెట్టారు. అందుకే ఇప్పుడు కేకే కూతురు విజయలక్ష్మిని మేయర్ చేసి గత హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది.
బీసీలకు అన్యాయం..
ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ చేసిన సంచలన వాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని గతంలో ఈటల ఆక్రోశం వ్యక్తం చేశారు. బీజేపీలో బీసీలను ఆకర్షించేందుకు ఆ పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్కు ప్రాధాన్యత ఇవ్వడం బీసీలను మచ్చిక చేసుకునే వ్యూహంలో భాగమే అంటారు. దీంతో గులాబీ దళపతి కేసీఆర్ కూడా బీసీలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.
బీసీలకే పదవీ
మేయర్ బొంతు రామ్మోహన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో..ఈసారి కూడా బీసీ వర్గానికి చెందిన విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.