రేపు ఇంటర్ కాలేజీలు బంద్.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు వైఖరి వల్ల విద్యార్థులు నష్టపోయారని విమర్శలు వస్తున్నాయి. తప్పిదాలు చోటు చేసుకున్నాయంటూ ఇంటర్ బోర్డుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి. విద్యార్థులకు న్యాయం జరిగేలా ఎన్ఎస్యూఐ పోరాటం చేస్తోంది. ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్కు పిలుపు ఇచ్చింది.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. వీరిలో కూడా చాలామంది బోర్డర్ మార్కులతో బయటపడ్డారు. ఒక్కరు కూడా 100 శాతం మార్కులు సాధించలేకపోవడం గమనార్హం. వీరంతా ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో వీరికి ఫస్టియర్ పరీక్షలు నిర్వహించ లేదు. పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో వీరికి పరీక్షలను నిర్వహించారు. ఫస్టియర్ పరీక్షలు ఉండవనే యోచనలో ఉన్న విద్యార్థులు ఫస్టియర్ను పక్కన పెట్టేసి, సెకండియర్ పై ఫోకస్ పెట్టారు. ఇలాంటి సమయంలో పరీక్షలను నిర్వహించడంతో విద్యార్థుల పరిస్థితి తారుమారైంది. దీంతోపాటు ఆన్ లైన్ విద్యాబోధన కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
వాస్తవానికి ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ అయిన విద్యార్థులు పదో తరగతి చదువుతున్న సమయంలో కరోనా వచ్చింది. దీంతో లాక్ డౌన్లు, ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా మంది విద్యార్థుల దగ్గర సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకపోవడం ఆవేదన కలిగించే విషయం. ప్రతి విద్యార్థికి ఇంటర్ మార్కులు చాలా కీలకం. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లను భర్తీ చేసే క్రమంలో ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ మార్కులు విద్యార్థుల భవిష్యత్తుపై నెగెటివ్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.