గెలిచినా సంబురాలు బంద్..! మందు, ర్యాలీలు, బాణసంచాపై నిషేధాజ్ఞలు
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక విజయోత్సవ ర్యాలీలు తీయడం, బాణసంచా కాల్చడం సాధారణం. అయితే ఈసారి గెలుపు సంబురాలపై ఆంక్షలు విధించింది అధికార యంత్రాంగం. గెలిచిన అభ్యర్థులు కార్యకర్తలు, అనుచరులతో ర్యాలీలు నిర్వహించకుండా 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్భగవత్ నిషేధాజ్ఞల్ని జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాలు వెలువడ్డాక గెలిచిన అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి హంగామా చేయొద్దని స్పష్టం చేశారు.
ఫలితాలు వెలువడ్డాక ఆయా పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే 3 కమిషనరేట్ల పరిధుల్లో నిషేధాజ్ఞల్ని విధించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ర్యాలీలు గానీ, బాణాసంచా పేల్చడం గానీ చేయరాదు. గుంపులు గుంపులుగా జనాలు పోగవడానికి వీలు లేదు. అటు మద్యం విక్రయాలపై కూడా నిషేధం విధించారు. వైన్షాపులతో పాటు బార్లు, హోటళ్లలో కూడా మద్యం విక్రయాలు జరపొద్దని ఆదేశించారు.