విజయశాంతి ఇలా..అగ్నిపథ్ వ్యతిరేక నిరసనల వెనుక కుట్ర అంటూ
అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. విపక్షాలు అధికార పక్షాన్ని ఏకిపారేస్తున్నాయి. అయితే ఫైర్ బ్రాండ్, రాములమ్మ మాత్రం నిరసనల వెనక కుట్ర అంటూ ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్, దేశవ్యాప్తంగా జరిగిన రైళ్ల విధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్టుగా ఇది ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు, విద్యార్థుల పనికాదని స్పష్టం చేశారు.

ప్రేరేపిత కుట్ర..?
అగ్నిపథ్ వ్యతిరేక నిరసనల వెనుక కచ్చితంగా ప్రేరేపిత కుట్ర ఉందని విజయశాంతి ఆరోపించారు. మోడీ సర్కారును, బీజేపీని వ్యతిరేకిస్తున్న అసాంఘిక శక్తులు, రౌడీ మూకల్ని రెచ్చగొట్టి చేయిస్తున్న హింసాకాండ అని పేర్కొన్నారు. ఉద్యమం ఏళ్ల తరబడి తీవ్రస్థాయిలో కొనసాగిన రోజుల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు, యువతీ యువకులు సంయమనంతో వ్యవహరించారని, రైల్ రోకో, వంటావార్పు, బంద్, శాంతియుత నిరసనలు చేపట్టారని వివరించారు.

జాతి ఆస్తులను తగలబెట్టలే..?
దురదృష్టవశాత్తు కొందరు ఆత్మార్పణం చేసుకున్నారే తప్ప, ఏనాడూ జాతి ఆస్తులను తగలబెట్టలేదని పేర్కొన్నారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేదని విజయశాంతి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్సారం చేసినా విద్యార్థులు శాంతియుతంగానే ఉన్నారని తెలిపారు.

వారే పాడు చేస్తారా..?
దేశం కోసం ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులు, యువకులు ఈ దేశ ఆస్తులనే పాడుచేస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. విధ్వంసకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సంబంధంలేని వ్యక్తులు, దుకాణాలపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేశారని తెలిపారు. పార్శిళ్లు తగలబెట్టారని, మహిళలు, వృద్ధులు సహా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేశారని వివరించారు. విద్యార్థులు, యువకుల పనే అంటే నమ్మాలా? అని విజయశాంతి ప్రశ్నించారు. కచ్చితంగా బీజేపీ వ్యతిరేకులు కుట్ర పన్ని, రెచ్చగొట్టి చేయించిన పనే అని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications