జనం కష్టాలకు కారణం కేసీఆరే, రాములమ్మ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఫైర్ బ్రాండ్, రాములమ్మ విజయశాంతి మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలకు సీఎం కేసీఆర్ కారణమని ఫైరయ్యారు. పాలనాపరమైన అంశాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అరిగోసలు పడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ పథకం కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదని చెప్పారు. రేషన్ కార్డుల కోసం ఏడు లక్షల దరఖాస్తులు సర్కారుకు రాగా, గతేడాది 3.10 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. హుజూరాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉపఎన్నిక సందర్భంగా వీరికి రేషన్ కార్డులు మంజూరు చేశారు. రాష్ట్రంలో మిగతా 3.90 లక్షల దరఖాస్తులను కనీసం పరిశీలించకుండానే కేసీఆర్ సర్కార్ రిజెక్ట్ చేసింది. గత జూన్ నుంచే మీసేవలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా 2014 నుంచి 19 లక్షల రేషన్ కార్డులను తొలగించింది. ఎలాంటి పరిశీలన లేకుండా, కార్డుదారులకు నోటీసులు ఇవ్వకుండా బోగస్ కార్డులంటూ తొలగించారు. రాష్ట్రంలో ఇంకా 41.61 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో మూలుగుతున్నయి.
ఖజానాపై భారం పడుతుందనే కారణంతో కొన్ని స్కీంలను పెండింగ్లో పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో స్కీంలు అందక, సమస్యలు పరిష్కారం కాక జనం ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదని ఫైరయ్యారు. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.70 లక్షల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. అప్లికేషన్లకు మూడు దఫాలుగా గడువు పొడిగించిన సర్కారు... పెన్షన్లను మాత్రం ఇప్పటిదాకా ఇవ్వలేదన్నారు. పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని గతేడాది సీఎం కేసీఆర్ ప్రకటించారు. సర్కారు జీవో కూడా జారీ చేసింది. మీ సేవ ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. ఇందులో పదిన్నర లక్షల మంది అప్లై చేసుకోగా.. అంతకుముందే 65 ఏండ్లు పైబడిన వాళ్లు 3 లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారని వివరించారు.
పలు విధాలుగా సామాన్య జనం ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ సర్కార్కు తగిన బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే రానుందని విజయశాంతి హెచ్చరించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే జనమే తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. జనంపై భారం మోపుతున్నారని విజయశాంతి మండిపడ్డారు.