జయలలిత మేనకోడలు దీపా ఇంటి రచ్చ: చంపేస్తామంటున్నారని కేసు పెట్టిన భర్త మాధవన్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా ఇంటి రామాయణం మళ్లీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తనను చంపేస్తానని దీపా కారు డ్రైవర్ రాజా బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని ఆమె భర్త మాదవన్ శనివారం చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జయలలిత మరణించిన తరువాత దీపా వెలుగులోకి వచ్చారు. రాజకీయంగా ఎదగాలని దీపా ప్రయత్నించారు. దీపా వెంటనే ఆమె భర్త కూడా ఉన్నాడు. అయితే రాజకీయంగా తనకంటే కారు డ్రైవర్ రాజాకు తన భార్య దీపా ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నదని మాధవన్ సహించలేకపోయాడు.
ఇదే విషయంలో చాలాసార్లు దీపా, మాధవన్ ల మధ్య గొడవ జరిగింది. ఓ సారి డ్రైవర్ రాజా, దీపా మద్దతుదారులు ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నించి ఆమె భర్త మాదవన్ ను గేట్ దగ్గరే అడ్డుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో దీపా ఇంటిలో మీడియా సమావేశం నిర్వహిస్తుండంతో విషయం బయటకు తెలిసి రచ్చరచ్చ అయ్యింది.
ఇప్పుడు దీపా కారు డ్రైవర్ రాజా తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని మనవి చేస్తూ మాధవన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై మాట్లాడటానికి జయలలిత మేనకోడలు దీపా నిరాకరించారు. మొత్తం మీద అమ్మ జయలలిత మేనకోడలు దీపా ఇంటిగుట్టు మరోసారి రోడ్డు మీదకు వచ్చింది.