జయ రిజైన్ చేసిన శ్రీరంగంలో అన్నాడీఎంకే గెలుపు, పనాజీలో బీజేపీ
శ్రీరంగం/పనాజీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఖాళీ చేసిన శ్రీరంగం నియోజకవర్గం నుండి అదే పార్టీకి చెందిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జయలలిత పైన అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. జయలలిత అక్రమ సంపాదన కేసులో అరెస్టై విడుదలయ్యారు.
జయలలిత అరెస్ట్ అవడమే కాకుండా ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దు కావడంతో శ్రీరంగంలో ఎన్నిక అనివార్యమైంది. దీంతో శ్రీరంగం నియోజకవర్గంలో ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. శ్రీరంగం శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు.
పనాజీలో బీజేపీ విజయం
గోవా రాష్ట్రంలోని పనాజీ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయభేరీ మోగించింది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్రమంత్రి మనోహర్ పారికర్కు కేంద్ర కేబినెట్లో చోటు లభించడంతో సీఎం పదవితో సహా, తాను ప్రాతినిధ్యం వహించిన పనాజీ శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో పనాజి ఉపఎన్నికలు జరిగాయి.
1994 నుండి పనాజీ స్థానానికి రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సిద్దార్థ్.. కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర పైన 5,368 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నవంబరులో మనోహర్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులవ్వడంతో ఈ స్థానం ఖాళీ అయింది.
లిరోమోబా స్థానంలో కాంగ్రెస్ గెలుపు
అరుణాచల్ ప్రదేశ్లోని లిరోమోబా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి న్యామర్ కార్బాక్ తన సమీప బీజేపీ అభ్యర్థి పైన కేవలం 119 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.