మా కుటంబం చాలా ఆవేదనకు గురైంది: సుష్మా స్వరాజ్ భర్త
సోషల్ మీడియాలో సుష్మాస్వరాజ్ పై ట్వీట్ల దాడి జరుగుతున్న నేపథ్యంలో తన భర్త మాజీ గవర్నర్ స్వరాజ్ కౌషల్ ఆమెకు అండగా నిలిచారు. పార్టీకానీ, ప్రభుత్వం కానీ ఈ విషయంపై స్పందించనందుకు ఒక్కింత ఆవేదనకు గురైనట్లు తెలిపారు. అంతకుముందు పాస్ పోర్ట్ విషయంలో ఓ జంట ఎదుర్కొన్న అవమానంపై సుష్మా స్వరాజ్ను ట్విటర్ వేదికగా కొందరు మాటలయుద్ధానికి దిగారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి సుష్మాపై దాడి చేయాల్సిందిగా ట్విటర్లో ట్వీట్ చేయడం తనను తన కుటుంబ సభ్యులను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పదని ఇలాంటి దురుసు పదజాలం వాడటం సరికాదన్నారు. సుష్మా ప్రాణం కన్నా తమకు ఏదీ ముఖ్యం కాదన్నారు కౌశల్.
సుష్మాకు ఘాటుగా ట్వీట్ చేసిన వ్యక్తిని ముఖేష్ గుప్తాగా గుర్తించారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన ముఖేష్.. ఆమెను కొట్టండి... మైనార్టీలను అవమానపర్చొద్దని తెలిసేలా చేయండి అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తన ట్విటర్ ఖాతాను డిలీట్ చేశాడు.

ఇదే క్రమంలో తనపై ట్విటర్ వేదికగా జరుగుతున్న దాడులకు నెటిజెన్లు మద్దతు పలుకుతారా అంటూ సుష్మా స్వరాజ్ ట్విటర్ పోల్ నిర్వహించగా అందులో 57 శాతం మంది ఆమెపై దాడిని ఖండించగా మరో 43శాతం మంది దాడులకే మద్దతు తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి అయిన సుష్మా స్వరాజ్కే వేధింపులు తప్పడం లేదంటే సామాన్య మహిళ పరిస్థితి ఏమిటంటూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.
సుష్మా స్వరాజ్ పై ట్విటర్ వేదికగా జరుగుతున్న మాటలయుద్ధంపై ఆమెనే స్వయంగా చర్యలు తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications