గుజరాత్ ఎన్నికల్లో రూట్ మార్చిన బీజేపీ, పటేల్ వర్గం ఓట్లు పోతే, బీసీలకు గాలం, 40 సీట్లు !
గుజరాత్ లో పటేల్ వర్గం ఓటర్లను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దీటైన సమాధానం చెప్పాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ లో పటేల్ వర్గం ఓటర్లను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దీటైన సమాధానం చెప్పాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. పటేల్ వర్గం ఓట్లు చెయ్యి జారిన సమయంలో రాష్ట్రంలోని ఇతర బీసీ కులాల ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది.
డిసెంబర్ లో గుజరాత్ లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. వీలైనన్ని శాసన సభ స్థానాల్లో బీసీలనే పోటీ చేయించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 40 శాసన సభ సీట్లు బీసీలకు ఇవ్వడానికి బీజేపీ నాయకులు సిద్దం అవుతున్నారు.
గుజరాత్ లో డిసెంబర్ 9, 14 తేదీల్లో 182 శాసన సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీసీల ఓట్లతోనే ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. పటేల్ వర్గం నాయకుడు హార్దిక్ పటేల్ ఇప్పటికే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.
గుజరాత్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడంలో మమ్మల్ని మోసం చేసిందని పటేల్ వర్గం గుర్రుగా ఉంది. గుజరాత్ లో పటేల్ వర్గం ఓట్లు 13 శాతం ఉన్నాయి. గుజరాత్ లో 146 బీసీ కులాల చెందిన 35 శాతం ఓటర్లు ఉన్నారు. పటేల్ వర్గం ఓట్లు చెయ్యిజారితే మిగిలిన బీసీల ఓట్లు బీజేపీకే రావాలని, బీసీ వర్గాలకే ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు నిర్ణయించారని తెలిసింది.