గీత దాటిన సన్నీ డియోల్, వేటు వేసేందుకు ఈసీ సన్నాహాలు ..? ఏం జరిగిందంటే ?
న్యూఢిల్లీ : 17వ లోక్సభ కొలువుదీరి కొన్ని గంటలే అవుతుంది. అయితే అప్పుడే కొన్ని చోట్ల ఉప ఎన్నికలు, మరికొందరి చర్యలపై ఈసీ దృష్టిసారించింది. వీరిలో ప్రముఖ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ చేరారు. ఎన్నికల సమయంలో నిర్దేశించిన ఆదేశాలను సన్నీ పాటించలేదని ఈసీ గుర్రుమీదుంది. దీనిపై నోటీసులు జారీచేస్తామనే సంకేతాలు ఇచ్చింది.
గీతదాటితే ..?
ఏదైనా ఎన్నిక జరిగే సమయంలో ఆ ఎలక్షన్కు సంబంధించి ఈసీ వ్యయానికి సంబంధించి పరిమితులు విధిస్తోంది. లోక్సభ ఎన్నికలకు కూడా రూ.70 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేయొద్దని అభ్యర్థులకు స్పష్టంచేసింది. కానీ అప్పుడే రాజకీయాల్లో చేరి .. గురుదాస్పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సన్నీ డియోల్ ఈ అంశాలేవి తెలియదు కాబోలు. అందుకే ఆయన ఇబ్బడి ముబ్బడి డబ్బులు ఖర్చుచేసి .. ఏరీ కోరీ మరీ కష్టాలు తెచ్చుకున్నారు. సన్నీ డియోల్ రూ.86 లక్షలు ఖర్చుచేసినట్టు ఈసీ గుర్తించింది. దీంతో ఆయనకు నోటీసులు జారీచేయాలని భావిస్తోంది.
పెరిగిన వ్యయం ..
ఎన్నికల్లో సన్నీ డియోల్ ఖర్చుకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద పక్కా సమాచారం ఉంది. దీంతో ఎన్నికల వ్యయం పెరిగేందుకు గల కారణాలు ఏంటని నోటీసులు జారీచేసే అవకాశం ఉంది. దీంతో ఆయన ఇచ్చే సమాధానంపై ఈసీ సంతృప్తి చెందకుంటే మరోలా కూడా చర్యలు తీసుకోవచ్చు. ఎన్నికలో రెండోస్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత సభ్యుడు సన్నీపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.
గెలుపొందారు .. కానీ ...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సన్నీ డియోల్ గురుదాస్పూర్ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ పోటీ చేసి .. ఓడిపోయారు. సునీల్పై సన్నీ డియోల్ 80 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇది అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకత అని బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతకుముందు కూడా గురుదాస్పూర్ నుంచి వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు. అతను బీజేపీ అభ్యర్థిగా ఉంటూనే మృతిచెందారు. నిన్న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజకీయ నేతలా కాకుండా సినీ తార మాదిరిగా హాజరయ్యారు. జీన్స్, వైట్ షర్ట్ దానిపై బ్లెజర్ వేసుకొని సభకు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. అయితే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల్లోనే ఆయన పదవీపై ఊగిసిలాట కొనసాగుతుంది. ఎన్నికల్లో దుబారా ఖర్చుపై నోటీసులు జారీచేయాలని ఈసీ చూడటం ఆయనకు మింగుడు పడని విషయమే.