2జీ కేసు: సీబీఐ ఛీప్ రంజిత్ సిన్హాకు సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలోని నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఆరోపణలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ సిన్హాకు సుప్రీం నోటీసు జారీ చేసింది. మీపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి వివరణను దాఖలు చేయాల్సిందేనని ఆదేశించింది. తాను అఫిడవిట్ దాఖలు చేయనని, మౌఖికంగానే ఆరోపణలను ఖండిస్తానని రంజిత్ సిన్హా చేసిన విజ్ఞప్తిపై న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆయనను పదవి నుండి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని, ఆయనపై సిట్ ద్వారా విచారణ జరపాలన్న నిర్ణయాన్ని కూడా పరిశీలించింది. "మీరు చెప్పదల్చుకున్నదంతా కాగితంపై చెప్పండి" అని పేర్కొంది. మీరు గనుక అఫిడవిట్ దాఖలు చేయనట్లైతే మీపై వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుందన్నారు.
ఆరోపణలకు సమాధానం ఇస్తూ సీల్డ్ కవర్లో ఒక అఫిడవిట్ దాఖలు చేయడానికి, తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ యోగ్యతపై అభ్యంతరాలు తెలియజేస్తూ మరోక అఫిడవిట్ దాఖలు చేయడానికి రంజిత్ సిన్హా అంగీకరించారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై వచ్చిన ఆరోపణలు నిజమని తెలితే 2జీ కేసులో ఆయన తీసుకున్న నిర్ణయాలు కోట్టివేస్తామని ధర్మాసనం పేర్కొంది.
సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను దూరంగా ఉంచాలని కామన్ రాజ్ అనే స్వచ్చంద సంస్ద సుప్రీంకోర్టును గురువారం కోరింది. 2జీ, 4జీ , బొగ్గు కుంభకోణాల కేసుల్లోని నిందితులు పలువురు రంజిత్ నిన్హాను ఆయన నివాసంలో కలుసుకుంటున్నారని, ఆయన ఇతర అధికారులెవ్వరూ లేకుండా రాత్రుళ్లు ఆలస్యంగా వారితో ఏకాంతంగా మాట్లాడుతూన్నారని ఆరోపించింది. స్వచ్చంద సంస్ద తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తున్నారు.