బీఎస్ఎన్ఎల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. భవిష్యత్తు??
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్లో భారత్ బ్రాడ్బాండ్ నెట్వర్క్(బీబీఎన్ఎల్) విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవలను పటిష్టం చేసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా భారీ ప్యాకేజీని ప్రకటించింది. రూ.లక్షా 64 వేల కోట్లతో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీకి అనుమతి తెలిపింది.
ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ అప్పులను వాటాలుగా మార్చబోతున్నట్లు వెల్లడించారు. బ్యాలెన్స్ షీట్ను తగ్గించడం, సేవలను మెరుగుపరచడం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ వంటి మూడు అంశాలు ఈ ప్యాకేజీలో ఉంటాయని తెలిపారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ ప్రజలకు అవసరమని, అందుకే పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించామన్నారు. 1,20,000 సైట్లలో 4జీ సేవలు అవసరమని, ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామని మంత్రి వివరించారు.
బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్యాకేజీ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం ప్రకటించాయి. 4జీ సేవలు, 5జీ సేవల విస్తరణకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటే ప్రయివేటు కంపెనీలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ పురోగమిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 5జీ స్పెక్ట్రం కూడా కేటాయించాలని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో సంస్థకున్న నెట్వర్క్ను బలోపేతం చేయడానికి వీలవుతుందన్నారు. సంస్థ పునరుద్ధరణకు ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.