రాజకీయాల్లోకి హీరో ఉపేంద్ర: అప్పుడే కేసు నమోదు, డబ్బులు తీసుకోవాలని ఓటర్లుకు చెప్పాడు !
రాజకీయాల్లోకి రియల్ స్టార్ ఉపేంద్రఅప్పుడే కేసు పెట్టిన ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుడుఓటర్లు డబ్బులు తీసుకోవాలని చెప్పారు, బెంగళూరులో కేసు నమోదు
బెంగళూరు: బహుబాష నటుడు, స్యాండిల్ వుడ్ రియల్ స్టార్, కర్ణాటక ప్రజ్ఞావంత (ప్రతిభావంతులు) జనతా పార్టీ (kPJP) వ్యవస్థాపకుడు ఉపేంద్ర మీద బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను రెచ్చగొట్టి చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఉపేంద్ర మీద కేసు పెట్టారు.
రియల్ స్టార్ ఉపేంద్ర మంగళవారం కర్ణాటక ప్రజ్ఞావంత (ప్రతిభావంతులు) జనతా పార్టీ (kPJP)ని ఏర్పాటు చేసి రాజకీయ రంగ్రప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో హీరో ఉపేంద్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం ఎవ్వరికి వెయ్యాలో మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలను ఉద్దేశించి ఉపేంద్ర అన్నారని ఆరోపణలు ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా రాజకీయ పార్టీల నాయకుల దగ్గర డబ్బులు తీసుకోవాలని ఉపేంద్ర ఓటర్లను రెచ్చగొడుతున్నారని ఆయన మీద చర్యలు తీసుకోవాలని జేడీయూ పార్టీ ఆరోపించింది.
జేడీయూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్, నాగేష్ బెంగళూరు నగరంలోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా గురువారం హీరో ఉపేంద్ర మీద ఫిర్యాదు చేశారు. ఉపేంద్ర మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రాజకీయ పార్టీ పెట్టిన హీరో ఉపేంద్ర కేవలం రెండు రోజుల్లోనే ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు పెట్టిన కేసు విచారణ ఎదుర్కొంటున్నారు.