మతమార్పిడులపై వెంకయ్య సవాల్! హిందుత్వంలోకి 500మంది క్రైస్తవులు
న్యూఢిల్లీ: మతమార్పిడుల పైన విపక్షాలు సభలో చేస్తున్న రాద్దాంతం పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం మండిపడ్డారు. వారి తీరు ప్రజలకు బాగు చేసేలా లేదని విమర్శించారు. విపక్షాలు చర్చించి, నిర్ణయం తీసుకుంటే నచ్చకుంటే వ్యతిరేకించవచ్చునని, కానీ సభను అడ్డుకోవడం ప్రజాప్రయోజనం కాదన్నారు.
ప్రజలు ఎవరైనా తమంతట తాము మతం మారితే అది ఇష్యూయే కాదన్నారు. అలాకాకుండా బలవంతపు మతమార్పిడులు ఉంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు.
మతమార్పిడుల పైన చట్టం తీసుకు వద్దామని కేంద్రం చెబుతుంటే, విపక్షాలు ఎందుకు సహకరించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యసభలో పదేపదే విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలనే ఒకే ఒక అంశం పైన వారు రాద్దాంతం చేస్తున్నారన్నారు.
మా లక్ష్యం మత మార్పిడి కాదు, ప్రజల హృదయాలు గెలుచుకోవడం: అశోక్ సింఘాల్
తమ అసలు లక్ష్యం మత మార్పిడి కాదని, ప్రజల హృదయాలను గెలుచుకోవడమని వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్ ఆదివారం అన్నారు. తాము హిందుత్వాన్ని రక్షించే విషయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే, మత మార్పిడి తమ లక్ష్యం కాదన్నారు. హృదయాలు గెలుచుకోవడమే అన్నారు. 800 ఏళ్ల తర్వాత భారత్లో హిందువులుగా చెప్పుకునే వారు అధికారంలోకి వచ్చారని అభిప్రాయపడ్డారు.
మన సంస్కృతిని, మతాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. ఎనిమిది వందల ఏళ్ల తర్వాత హిందుత్వాన్ని రక్షించగలిగే ప్రభుత్వం వచ్చిందని అభిప్రాయపడ్డారు. తాము ప్రపంచాన్ని మన మతంలోకి తేవాలని కోరుకోవడం లేదని, ప్రపంచం హృదయాన్ని గెలుచుకోవాలన్నారు.
12వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చవాన్ అధికారం కోల్పోయాక... ఇన్నేళ్ల తర్వాత హిందువుగా చెప్పుకునే వారు అధికారంలోకి వచ్చారని.. ఆయన బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ద్వేషించడం ద్వారా కొందరు (ఇతరులు) తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మతమార్పిడి చట్టంపై దిగ్విజయ్ సింగ్
మతమార్పిడి నిరోధక చట్టానికి వ్యక్తిగతంగా తాను వ్యతిరేకం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎందుకంటే వీహెచ్పీ, బజరంగ్ దళ్ ఇప్పుడు అదే చేస్తున్నాయన్నారు. బలవంతం లేదా ప్రలోభం ద్వారా మతం మార్చుతున్నాయన్నారు.
ఆరెస్సెస్ బలవంతం, ప్రలోభ పెట్టడం ద్వారా మతమార్పిడి నిరోధక చట్టాన్ని కోరుతోందని ఆరోపించారు. వారు ఘర్ వాపసీని మతమార్పిడిగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. కాగా ప్రతిపక్షాలు వీహెచ్పీ చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమం పైన మండిపడుతున్నాయి.
హిందుత్వంలోకి 500 మంది గిరిజన క్రైస్తవులు
క్రైస్తవులుగా కొనసాగుతున్న 500 మంది గిరిజనులను హిందూ మతంలోకి మార్చామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. గుజరాత్లోని సూరత్కు సమీపంలోని వల్సాద్లో శనివారం చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా గిరిజనులను హిందూ మతంలోకి తీసుకొచ్చామని ఆ సంస్థ ప్రకటించింది.
ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి తాము ఎలాంటి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని ప్రకటించింది. అయితే, తాము చట్టాన్ని మాత్రం ఉల్లంఘించలేదని పేర్కొంది. మత మార్పిడిలో గిరిజనులను తాము బలవంతపెట్టలేదని వల్సాద్ వీహెచ్పీ కార్యదర్శి అజిత్ సోలంకి చెప్పారు.