ప్రాణం తీసిన 'కులం' : ఇంతకన్నా ఘోరం ఉంటుందా!
ఉత్తరప్రదేశ్ : దేశంలో అసమానతలను అత్యధికంగా ప్రభావితం చేసేవాటిల్లో కులం ఒకటి. ఏళ్లుగా భారతీయ సమాజం పునాదుల్లో పాతుకుపోయిన కులానికి నేటికి తలలు తెగిపడుతూనే ఉన్నాయి. అగ్రకుల దురహంకారం పెచ్చుమీరుతుండడంతో ఇప్పటికీ దళితులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని బాగేశ్వర్ జిల్లా కదారియలో నివసించే సోహాన్ రామ్ (31) గోధుమలు పట్టించడం కోసం స్థానికంగా ఉండే కుందన్ కుమార్ సింగ్ అనే వ్యక్తికి చెందిన పిండిమర దుకాణంకు వెళ్లాడు. అక్కడ గోధుమలను పట్టించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో.. లలిత్ కర్ణాటక్ అనే అనే అగ్రకుల ఉపాధ్యాయుడు అతనికి ఎదురుపడ్డాడు. దీంతో సోహాన్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టిన లలిత్.. సోహాన్ ను కులం పేరుతో దూషించాడు. సోహాన్ గోధుమలు పట్టించడం వల్ల పిండిమర మలినమైందని తీవ్రంగా అవమానించాడు.
అక్కడి తో ఆగిపోలేదు.. తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయిన్ లలిత్ సోహాన్ ను కొడవలితో నరికి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లలిత్ ను అరెస్టు చేసి హత్య కేసుతో పాటు అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.
దీనిపై గ్రామస్తులు చెబుతున్నదేంటంటే.. నిజానికి కుందన్ పిండిమరను గ్రామంలోని దళితులు అగ్రకులస్తులు అందరూ వాడుకునేవారు. అయితే దసరా పండుగ నేపథ్యంలో తాము దుర్గామాతకు సమర్పించే నైవేద్యాల కోసం.. ముందుగా తాము పిండి పట్టించుకున్న తర్వాతే దళితులు ఆ పిండి మరను ఉపయోగించుకోవాలని అక్కడి అగ్రకులస్తులు ఆదేశించారు.
ఇదే క్రమంలో సోహాన్ పిండిని పట్టించుకోవడానికి వెళ్లడం.. సదరు అగ్రకుల ఉపాధ్యాయుడిని పట్టరాని ఆవేశానికి గురిచేసి, చివరకు హత్యకు దారితీసింది. పండుగలు దేవుళ్లు కూడా కులం పేరిట కలుషితమైన చోట ఇలాంటి అమానవీయ ఘటనలు ఇంకెన్నాళ్లో!