దళితులపై ఇంత ఘోరమా.. గుంజీలు తీయించి, నేలపై ఉమ్మివేసి నాకించిన దాష్టీకం; వైరల్ వీడియో
దళితులపై వివక్ష లేకుండా ఉండటం కోసం, సమాజంలో నిమ్న కులాలుగా చిన్నచూపు చూడబడుతున్న వారికి న్యాయం చెయ్యటం కోసం ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా, దేశంలో ఎక్కడో ఒక చోట దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. దళితులను దూషించినా, దళితులపై దాడులు చేసినా వారిపై కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిసినప్పటికీ సమాజంలో దళితులపై చిన్నచూపు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా అలాంటి దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.

డబ్బు తీసుకుని ఓటేయలేదని ఇద్దరు దళితులపై దాష్టీకం
డబ్బులు తీసుకుని తమకు ఓటు వేయలేదని పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఒక క్యాండిడేట్ ఇద్దరు దళితులపై అమానుషంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో పంచాయతీ హెడ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి బల్వంత్ సింగ్ తన ఓటమికి దళిత సమాజంపై నిందలు వేసి, తనకు ఓటు వేయలేదని ఆ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు.
గుంజీళ్ళు తీయించి.. నేలపై ఉమ్మి వేసి నాకించిన ఘటన .. వీడియో వైరల్
ఇద్దరు ఓటర్లకు తాను డబ్బులిచ్చానని, వారు ఇప్పటికీ తనకు ఓటు వేయలేదని బల్వంత్ పేర్కొన్నాడు. ఆయన ఇద్దరు వ్యక్తులను మాటలతో దుర్భాషలాడుతూ, వారి చెవులు పట్టుకుని గుంజీలు తీయించాడు. అంతేకాదు వారిలో ఒకరిపై శారీరకంగా దాడి చేసి, నేలపై ఉమ్మివేసి, బలవంతంగా నాకించాడు. అతనిని మెడ పట్టుకుని బలవంతంగా నేలపైకి ముఖాన్ని అదిమి మరీ నాకేలా చేశారు. పంచాయతీ హెడ్ గా పోటీ చేసిన బలవంత్ సింగ్ ఓడిపోవడంతో, డబ్బులు తీసుకున్న దళితులు తమకు ఓటు వెయ్యక పోవడమే కారణమని ఆవేశంతో రగిలిపోయిన అతను ఈ దారుణానికి పాల్పడినట్లుగా వీడియోలో మాట్లాడిన మాటల ఆధారంగా తెలుస్తోంది. ఇక బల్వంత్ సింగ్ వారిని వేధించడం ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మద్యం తాగి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అలా చేశానని చెప్తున్న బల్వంత్ సింగ్
అయితే దీనిపై మాట్లాడిన బల్వంత్ సింగ్ ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించి, అందుకే వారిని ఆ విధంగా శిక్షించానంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కంతేష్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని మిశ్రా తెలిపారు.
Recommended Video

సోషల్ మీడియాలో వైరల్ వీడియో .. నెటిజన్లు ఫైర్
ప్రస్తుతం ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. మన నాగరిక సమాజం లోనే ఉన్నామా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంత అవమానకరం, మన సమాజంలో ఇలాంటి అసభ్యత ఇంకా కొనసాగుతోందని ఈ ఘటన చూస్తే అర్థమవుతుందని చెప్తున్నారు. పోలీసులు నేరస్థుడిని అరెస్టు చేసినప్పటికీ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఆశిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉంది సమ న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కుల వివక్ష కాదా అంటూ నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications