డ్యాన్స్ బార్లకు పాత నిబంధనలే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లు నిర్వహిస్తున్న వారికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. డ్యాన్స్ బార్లు ఇప్పటి వరకు పాటిస్తున్న పాత నిబంధనలనే కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
డ్యాన్స్ బార్లు నిర్వహించే వారికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. డ్యాన్స్ బార్లు రాత్రి 11.30 గంటలకు మూసివేయాలని, మద్యం విక్రయించరాదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నిబంధనలు పెట్టింది.
ముంబై నగరంతో సహ మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్లు నిర్వహిస్తున్న వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను తప్పుపట్టింది.
డ్యాన్స్ బార్లలో మద్యం విక్రయించరాదనుకుంటే మహారాష్ట్రలో మద్య నిషేధం విధించాలని సూచించింది. డ్యాన్స్ బార్లు, బార్లు లైసెన్స్ లు ఉన్న వారు మద్యం విక్రయించరాదని ఎలా చెబుతారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మహిళల గౌరవం కాపాడటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని సుప్రీం కోర్టు చెప్పింది. డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగినట్లు అవుతుందని సుప్రీం కోర్టు తెలిపింది.