ఆధార్ అనుసంధానం: సంక్షేమ పథకాలకు గడువు మార్చి 31 వరకు పొడిగింపు
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ అనుసంధానానికి గడువు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
ఢిల్లీ: ఆధార్ అనుసంధానానికి గడువు మరింత పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలనే విషయం తెలిసిందే.
ఈ ఏడాది డిసెంబరు 21వ తేదీతో ముగియనున్న గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచుతున్నట్లు.. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనానికి తెలిపారు.
ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు ఖాతాలకు, మొబైల్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను.. చీఫ్ జస్టిస్ దీపక్మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు పెంచుతున్నట్లు కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
బ్యాంకు ఖాతాలకు, మొబైల్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారిపై తీసుకునే చర్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వీటిపై ప్రభుత్వం నుంచి తనకు మరికొంత సమాచారం అవసరమని అటార్నీ జనరల్ కోర్టుకు తెలుపగా.. వచ్చే సోమవారం ఈ విషయంపై కూడా స్పష్టత నివ్వాలని బెంచ్ ఆదేశించింది.