దేశంలో డెంగ్యూ కలకలం: పెరుగుతున్న కేసులు, మరణాలు, 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: ఓ వైపు దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుతుండగా.. మరో వైపు పలు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాలతో మరణిస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను పంపింది.
డెంగ్యూ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలు సూచనలు చేయనున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ)తోపాటు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నిపుణులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
ముఖ్యంగా డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించడంతోపాటు వ్యాధి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకోనున్నారు. అంతేగాక, రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడం, జాగ్రత్తలను తెలియజేయనున్నారు. డెంగ్యూ జ్వరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తున్నారు.
కాగా, ఢిల్లీలో ఈ ఏడాదిలో 1530 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం ఒక్క అక్టోబర్ నెలలోనే 1200 కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు దేశ వ్యాప్తంగా డెంగ్యూ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాలతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.