బిజెపి ధ్వజం: ఆదర్శ్ స్కామ్లో దేవయాని పాత్ర?
ముంబై: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ తుది నివేదికను రాష్ట్ర మంత్రివర్గం తిరస్కరించడంపై బిజెపి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్పై విరుచుకుపడుతోంది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై విచారణ జరిపిన కమిషన్ తుది నివేదికను ప్రభుత్వం అంతకు ముందు శాసనసభ ముందు ఉంచింది. ఆ నివేదికలో రాజకీయ నాయకుల పేర్లు, అధికారుల పేర్లు చోటు చేసుకున్నాయి.
అర్హత లేకపోయినప్పటికీ ఫ్లాట్స్ పొందినవారిలో అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయాని పేరు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బంధువుల పేర్లు ఉన్నాయని పిటిఐ వార్తా సంస్థ ఓ వార్తాకథనంలో తెలిపింది. నివేదికను తిరస్కరించడం ద్వారా కాంగ్రెసు, ఎన్సీపి సంయుక్త ప్రభుత్వం అవినీతి ముఖం బయటపడిందని బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫద్నావిస్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
నివేదికను తిరస్కరించడం ద్వారా అశోక్ చవాన్ కూడా అవినీతిలో పాలు పంచుకున్నానని రుజువు చేసుకున్నారని ఫద్నవీస్ వ్యాఖ్యానించారు. ఆదర్శ్ కుంభకోణంపై న్యాయ పోరాటం చేయడానికి గల అవకాశాలపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు.
కాంగ్రెసు, ఎన్సీపి ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడుతామని అన్నారు. దోషులకు శిక్ష పడేవరకు తాము న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టుకూ సుప్రీంకోర్టుకూ వెళ్తామని ఆయన చెప్పారు.