జయలలితపై పోటీ: ఎవరీ సిమ్లా ముత్తుచోళన్?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఇప్పుడొక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ పేరే సిమ్లా ముత్తుచోళన్. ఇంతకీ ఆమె పేరు ఇంతలా వినిపించడానికి కారణం ఏమిటంటే ఆర్కే నగర్ నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే తరఫున బరిలోకి దిగడమే.
దీంతో కేవలం చెన్నైలోని ఓటర్లతో పాటు తమిళనాడులోని మారుమూల గ్రామాల్లో కూడా ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. నిజానికి డీఎంకే-కాంగ్రెస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ నేత ఖుష్బూ జయలలితపై పోటీ చేయవచ్చనే వూహాగానాల వచ్చాయి. కానీ చివరకు ఆర్కే నగర్ నుంచి డీఎంకే జయలలితకు ప్రత్యర్థిగా సిమ్లా ముత్తుచోళన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
కన్యాకుమారి జిల్లాలోని రామనాథపుదూర్ ఆమె స్వస్థలం. డీఎంకే ఫ్యామిలీగా పేరుగాంచిన మాజీ మంత్రి సర్గుణ పాండియన్ రెండో కోడలే ఈ సిమ్లా ముత్తుచోళన్. వయసు 35. ఆమె అసలు పేరు ఆంటని సిమ్లా షిని. చెన్నైలో ముఖ్యమంత్రి జయలలిత చదువుకున్న చర్చ్పార్క్ కాన్వెంట్లోనే సిమ్లా విద్యాభ్యాసం చేశారు.
బీబీఏ, ఎల్ఎల్బీ పూర్తిచేశారు. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగానూ ఉన్నారు. భర్త పేరు ముత్తుచోళన్. 2009లో వీరిద్దరికి వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడున్నాడు. గత ఏడేళ్లుగా న్యాయవాదవృత్తిలో ఉన్న సిమ్లా డీఎంకేలో 13 ఏళ్లుగా సేవలందిస్తున్నారు.
ప్రారంభంలో నార్త్ చెన్నై మహిళా విభాగంలో నిర్వాహకురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా విభాగం ప్రచార బృందం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో పలుమార్లు ఉచితంగా వైద్య శిబిరాలను నిర్వహించారు. ఉచిత న్యాయసలహా కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు.
జయలలితపై పోటీగా బరిలోకి దిగుతున్నారు కదా అని ఆమె వద్ద ప్రస్తావించగా.... ఢిల్లీ, పళని.. వంటి పేర్లలాగానే నాకు సిమ్లా అని మా నాన్న గారు పేరు పెట్టారు. కన్యాకుమారి జిల్లాలో ఇలాంటి పేర్లు సహజమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జయలలిత తన నియోజకవర్గమైన ఆర్కే నగర్కు ఎలాంటి మంచి పనులు చేయలేదని అన్నారు.
ఆర్కే నగర్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ ఈ ప్రాంతాల్లో ఆమె పర్యటించలేదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో నెరవేర్చని పథకాలు ఎన్నో ఉన్నాయని, ఊరికే శంకుస్థాపన పనులు చేసి ఆపేసిన పథకాలు ఎన్నో ఉన్నాయని, ఇలాంటి వైఫల్యాలను తప్పకుండా ప్రజల వద్దకు తీసుకెళ్తానని చెప్పారు.
మరోవైపు ఆర్కే నగర్ నుంచి ట్రాన్స్ జెండర్ దేవి బరిలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జయలలిత గెలుపు ఖాయమనే అంచనాలు ఉన్నప్పటికీ ఆమెకు భారీ మెజార్టీ రాకుండా పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 2015 ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి కన్నా16 రెట్ల ఓట్లను సాధించి జయలలిత విజయం సాధించింది.
అయితే, ఈ సారి జరగనున్న ఎన్నికల్లో జయలలిత ఓటు బ్యాంకుకు గండికొట్టాలనే ఉద్దేశంతో దేవి ఉంది. తమిళ జాతీయవాద పార్టీ అయిన 'నామ్ తమిలార్ కచ్చి' తరపున బరిలోకి దిగనున్న దేవి గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ కాలినడకనే వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్న దేవి స్థానిక సమస్యలు నీటి కొరత, రేషన్ కార్డులు లేకపోవడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావిస్తోంది.
ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ... 'ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి జయలలిత పోటీ చేస్తారని తెలిసినప్పుడు నేను మొదట్లో భయపడ్డాను. అయితే, మా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. దీంతో కొంత ధైర్యం వచ్చింది' అని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి ట్రాన్స్ జెండర్ అభ్యర్థి దేవి (33) కావడం విశేషం.