వాజపేయికి భారతరత్న: అద్వానీ ఉద్వేగం, స్వాగతించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయికి భారతరత్న ప్రకటించడంపై మరో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఎమోషనల్ అయ్యారు. కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసించారు. వాజపేయితో అద్వానీకీ అయిదు దశాబ్దాల సంబంధం ఉంది.
ఈ నేపథ్యంలో అద్వానీ మాట్లాడుతూ.. వాజపేయీ అసాధారణ దేశభక్తుడు అన్నారు. తొంభై ఏళ్ల వాజపేయి ఎలాంటి మచ్చ లేకుండా దేశాన్ని పాలించారన్నారు. ఎక్కువ కాలం పాలించినప్పటికీ ఆయన పైన ఎలాంటి మచ్చ లేదని అద్వానీ చెప్పారు.
యూపీఏ హయాంలోనే వాజపేయికి అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాల్సి ఉండెనని చెప్పారు. తాను 2008లో ప్రధాని మన్మోహన్ సింగ్కు వాజపేయికి భారతరత్న ఇవ్వాలని లేఖ రాశానని చెప్పారు.
భారతరత్న ఇవ్వాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. కేంద్రం ఇద్దరు అసాధారణ దేశభక్తులకు భారతరత్న ఇచ్చిందని వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలను ఉద్దేశించి చెప్పారు.
వాజపేయికి, మాలవ్యాలకు భారతరత్న: స్వాగతించిన కాంగ్రెస్
వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. వీరిద్దరికి కేంద్రం భారతరత్న ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెసె పార్టీ తెలిపింది. వాజపేయికి భారతరత్న ఇవ్వడాన్ని మమతా బెనర్జీ, కేసీఆర్, నితీష్ కుమార్ తదితరులు స్వాగతించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. వాజపేయి, మాలవ్య ఇద్దరు దేశానికి ఎంతో సేవ చేశారని, గొప్ప నాయకులు చూపిన మార్గంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. వాజపేయి రాజధర్మం గురించి మాట్లాడేవారని, మోడీ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాలిస్తారని భావిస్తున్నామని మాకెన్ అన్నారు.
లతామంగేష్కర్ అభినందన
వాజపేయికి భారతరత్న రావడంపై ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ ఆనందం వ్యక్తం చేశారు. వాజపేయికి ఆమె అభినందనలు తెలిపారు. అతను ప్రపంచ రత్నం అన్నారు.