జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్: ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతం!!
జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడడం కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వారిని అడ్డగించడం కోసం, అలాగే ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఆపరేషన్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ జరిగింది.
ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం
సోపోర్ ప్రాంతంలో ఇద్దరు జైషే మొహ్మద్ (జేఎం) ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు గురువారం తెలిపారు. భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత బుధవారం రాత్రి సోపోర్ పట్టణంలోని బొమై ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్లో భద్రతా సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారని చెప్పారు. ఉగ్రవాదులు సామాన్యులను టార్గెట్ చేసి దాడికి పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం మేరకు పోలీసులు ఎన్ కౌంటర్ లో వారిని మట్టుబెట్టారు. అయినప్పటికీ ఎదురుకాల్పుల్లో ఓ పౌరుడికి కూడా గాయాలయ్యాయని పేర్కొన్నారు.
పౌరులపై దాడులకు ప్లాన్ చేస్తున్న క్రమంలో మట్టుబెట్టిన ఆర్మీ
ఈ ఘటనలో మృతి చెందిన ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్తో అనుబంధం కలిగి ఉన్నారని, వీరిద్దరూ పౌరులపై దాడులకు ప్లాన్ చేస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇంకా ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని వెల్లడించారు . హతమైన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులను సోపోర్కు చెందిన మహ్మద్ రఫీ & పుల్వామాకు చెందిన కైజర్ అష్రఫ్గా పోలీసులు గుర్తించారు. టెర్రరిస్ట్ రఫీపై గతంలో రెండుసార్లు పిఎస్ఎ కింద కేసులు నమోదు చేయబడ్డాయి. వీరు ఇద్దరూ అనేక ఉగ్రవాద నేరాల కేసుల్లో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు.
ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ప్రచ్చన్న పోరుతో భయం గుప్పిట్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు
తమకు అందిన సమాచారం ప్రకారం వారు సోపోర్ ప్రాంతంలో పౌరులపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కశ్మీర్ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న పోరులో సామాన్యులు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని అయోమయ స్థితిలో ఉన్నారు.