ఎస్పీజీ భద్రత వద్దు: కేంద్రానికి మన్మోహన్ కుమార్తె లేఖ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను తిరస్కరించారు. ప్రధాని పదవి నుంచి మన్మోహాన్ దిగిపోయి ఏడాదిన్నర అవుతుంది. నిబంధనల మేరకు ఆయనతో పాటు ఆయన కుమార్తెలకు కేంద్రం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను కల్పిస్తోంది.
ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన కుమార్తెలిద్దరూ కేంద్ర హోంశాఖకు లేఖలు రాశారు. ఈ తరహా భద్రత తమను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోందని, ఈ భద్రత వల్ల సౌకర్యంగా ఉండలేక పోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే మన్మోహన్ సింగ్ పెద్ద కుమార్తె, రచయిత్రి దామన్ సింగ్కు ఎస్పీజీ భద్రత స్థానంలో ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న మన్మోహన్ సింగ్ చిన్న కుమార్తె ఉపిందర్ సింగ్ కూడా ఎస్పీజీ భద్రత అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో వారి భద్రత పరిస్థితులపై సమీక్షించిన ఢిల్లీ పోలీసు అధికారులు మాజీ ప్రధాని కుటుంబసభ్యులు కోరినట్లుగా ఎస్పీజీ భద్రతను ఉపసంహరించి 'వై' కేటగిరి భద్రత కల్పించేందుకు నిర్ణయించారు.
దీంతో త్వరలోనే ఆమెకు ఎస్పీజీ భద్రత స్ధానంలో ఢిల్లీ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేస్తామని హోం శాఖ ఉన్నాతాధికారి ఒకరు చెప్పారు. ఈ కేటగిరీ కింద 11 మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు షిప్టుల్లో విధులు నిర్వహిస్తారు. సాధారణంగా మాజీ రాష్ట్రపతి, మాజీ ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధానమంత్రులకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తుంటారు.