కేరళ వరదలు: గూగుల్ భారీ విరాళం, రూ.7 కోట్లు ఇస్తామని వెల్లడి
తిరువనంతపురం: భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్ ఒక మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు రూ.7 కోట్లు విరాళంగా ఇచ్చింది. కేరళలో వరద కారణంగా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది.
దీంతో ఇక్కడ పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని ఇచ్చింది. ఏడుకోట్ల రూపాయలు ఇస్తున్నట్లు మంగళవారం గూగుల్ కంపెనీకి చెందిన అధికారులు వెల్లడించారు.
గూగుల్ డాట్ ఆర్గ్, గూగ్లర్స్ కలిసి ఈ మొత్తాన్ని కేరళ రిలీఫ్ వర్క్స్ కోసం విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేరళ వరదల నేపథ్యంలో గూగుల్ ఇప్పటికే పర్సన్ ఫైండ్ పేరుతో ఆచూకీ దొరికేందుకు ఈ టూల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. రాహుల్ కేరళకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. మంగళవారం ఉదయం త్రివేండ్రం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ చెన్గన్నూర్కు వచ్చారు. అక్కడ ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి వెళ్లి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వరద ప్రభావం అధికంగా ఉన్న చెన్గన్నూర్, అలపుజా, అంగమలీ ప్రాంతాల్లో ఈరోజు పర్యటించనున్నారు. రేపు వాయాంద్ జిల్లాలో పర్యటన చేయనున్నారు. వరదల్లో ప్రజలను కాపాడడానికి సహాయం చేసిన స్థానిక యువత, మత్స్యకారులు, స్వచ్ఛంద కార్యకర్తలను కలిసి మాట్లాడనున్నారు.