అంబేడ్కర్ ఘర్ వాపసీకి అనుకూలమా?: ఆయన చెప్పారు, ఆరెస్సెస్ ప్లాన్
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) ఘర్ వాపసీకి ఓ రకంగా అంబాసిడర్గా ఉపయోగించుకోవాలనకుంటోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అంబేడ్కర్ ఘర్ వాపసీని సమర్థించారని ఆరెస్సెస్ చెబుతోంది. ఈ నెల అంబేడ్కర్ జయంతి నుండి ఓ ప్రణాళిక ప్రకారం ఆరెస్సెస్ ముందుకు వెళ్లేందుకు సన్నద్దమవుతోందని తెలుస్తోంది.
అంబేడ్కర్ సంపూర్ణ దృక్పథమున్న జాతీయవాద నేతగా ఎత్తి చూపాలని ఆరెస్సెస్ భావిస్తోంది. అంబేడ్కర్ రచనలు, ఆయన పైన రాసిన వ్యాసాలతో ఆరెస్సెస్ పత్రికలు, ఆర్గనైజర్, పాంచజన్యలు ఏప్రిల్ 14న ప్రత్యేక సంచికలు తీసుకు రానున్నాయి. దళిత నేతగా, రాజ్యాంగ రూపకర్తగానే పేర్కొంటూ అంబేడ్కర్ స్థాయిని తగ్గించారని, జవితంలోని అన్ని రంగాల్లోను ఆయన కృషిని చాటాలని ఆరెస్సెస్ భావిస్తోంది.
అందులో ఘర్ వాపసీ కోణం కూడా ఉంది. మతం, ధర్మం పైన అంబేడ్కర్ అభిప్రాయాలు చాలా లోతైనవని ఆరెస్సెస్ చెబుతోంది. అంబేడ్కర్ తన పుస్తకంలో రాజకీయ ఇస్లాం ముప్పుపై రాశారని, ఇవన్నీ నిర్లక్ష్యం చేశారని ఆరెస్సెస్ నేత, ఆర్గనైజర్ సంపాదకులు ప్రఫుల్ కేట్కర్ చెప్పారు.
1948లో పాకిస్తాన్లో, నిజాం పాలనలోని హైదరాబాదు రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులకు లోనైన ఎస్సీలకు పిలుపునిస్తూ... తప్పించుకోవడానికి మతం మారడం ఒక్కటే మార్గం కాదని, వారిని దేశంలోకి ఆహ్వానిస్తామని, మతం మారిన తర్వాత చేరదీస్తామని పేర్కొన్నారని తెలిపారు.
బలవంతపు మతమార్పిడులను అంబేడ్కర్ వ్యతిరేకించారని, పాకిస్తాన్, హైదరాబాదుల్లో ఎస్సీలు బలవంతంగా మతం మారితే, వారు తిరిగి తమ మతంలోకి రావొచ్చని చెప్పారని, ఇది ఘర్ వాపసీకి అనుకూలమేనని ప్రఫుల్ కేట్కర్ అన్నారు.
అంబేడ్కర్ హిందూయిజానికి దగ్గరగా ఉన్న బుద్దిజాన్ని స్వీకరించారని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీర్ సావర్కర్, మదన్ మోహన్ మాలవ్యాల వలే అందరికీ మార్గదర్శకుడు అని ఆరెస్సెస్ అభిప్రాయపడుతోంది.