యూపీ లోకల్ బాడీస్: పార్టీల కన్నా స్వతంత్రులే బెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్థలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించామని లక్నో మొదలు వారణాసి వరకు.. అలహాబాద్ నుంచి గోరఖ్ పూర్ వరకు... అటు ఢిల్లీ మొదలు గల్లీ వరకు కమలనాథులు జోరుగా సంబురాలు చేసుకున్నారు. కానీ వాస్తవ గణాంకాలు తద్భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 16 నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో 14 చోట్ల బీజేపీ, మీరట్, అలీగఢ్ నగర పాలక సంస్థలకు బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించిన మాట నిజమే. కానీ అదే పూర్తిగా నిజం కాదు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో బీజేపీ పూర్తిగా విజయాలు సాధించిందనన ప్రచారం పూర్తిగా నిజం కానేకాదు. మేయర్ పదవుల గెలుపులో ముందంజలో ఉండటం కమలనాథులకు సంతోషం కలిగించే అంశం అనే ఎవరూ కాదనలేని నిజం.
కానీ పలు ప్రాంతాల్లో నగర పంచాయతీ, నగర పాలిక (మున్సిపాలిటీ)ల్లో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మొదలు బీఎస్పీ, ఆమ్ఆద్మీ పార్టీ కూడా బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్ తోనే అధికార బీజేపీ విజయం సాధించిందన్న ఆరోపణలు గుప్పించాయి. దీనిపై మాత్రం అధికార బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు.
ఎస్పీ మూడో స్థానం.. 126 స్థానాలకు కాంగ్రెస్ పరిమితం
రాష్ట్ర వ్యాప్తంగా నగర పంచాయతీల్లో 71.31 శాతం సీట్లు స్వతంత్రులే గెలుచుకున్నారు. అంటే 3,875 సీట్లను స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇక అధికార బీజేపీ కేవలం 664 సీట్లలో మాత్రమే విజయం సాధించారు. అదీ మొత్తం నగర పంచాయతీల్లోని కౌన్సిలర్ల సీట్లలో 12.22 శాతం. ఇక ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) 453 (8.34 శాతం), బీఎస్పీ 218 (4.01 శాతం) సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 126 స్థానాల్లోనే గెలుపొందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 438 నగర పంచాయతీ చైర్పర్సన్ పదవులకు స్వతంత్రులు 182 (41.55%) చోట్ల విజయం సాధించగా, బీజేపీ 100 చైర్ పర్సన్ (22.83%) పదవులను గెలుచుకున్నది.
18% ఓట్లతో బీజేపీ రెండోస్థానం.. 70 చోట్ల చైర్ పర్సన్ పదవులు
నగర పాలిక పరిషత్ల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీల కంటే స్వతంత్ర అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలోని 198 నగర పాలిక పరిషత్ల పరిధిలోని 5260 వార్డుల్లో స్వతంత్రులు 3380 వార్డుల్లో (64.25%) విజయం సాధించారు. బీజేపీ 922 వార్డుల్లో అంటే 17.53 శాతం మాత్రం విజయం సాధించగలిగారు. 198 నగర్ పాలిక పరిషత్ చైర్ పర్సన్ పదవులకు బీజేపీ 70, సమాజ్వాదీ పార్టీ 45, స్వతంత్ర అభ్యర్థులు 43 చోట్ల విజయం సాధించారు. నగర పాలక సంస్థల పరిధిలో 1299 మంది మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ 596, స్వతంత్ర కార్పొరేటర్లు 224 డివిజన్లలో విజయం సాధించారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కంటే స్వతంత్ర కార్పొరేటర్లు ఎక్కువగా గెలుపొందారు.
నగర పాలక సంస్థలకు ఈవీఎంల్లోనే పోలింగ్.. మిగతా బ్యాలెట్ పేపర్లే
కాంగ్రెస్ పార్టీ మొదలు సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)లు ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల తీరుపై విమర్శలు గుప్పించాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. తద్వారా మాత్రమే 14 నగర పాలక సంస్థల్లో విజయం సాధించగలిగిందని స్పష్టం చేసింది. మేయర్ పదవికి ఈవీఎంలు, నగర పాలిక పరిషత్ లు, నగర పంచాయతీల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించారు. గత నెల 22, 26, 29 తేదీల్లో రాష్ట్రంలోని 16 నగర్ నిగమ్లు, 198 నగర పంచాయతీలు, 438 నగర పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల ఒకటో తేదీన ఫలితాలు వెలువడ్డాయి.
పలు ప్రాంతాల్లో బీజేపీకి ధీటుగా సమాజ్ వాదీ సవాల్
పట్టణ పాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కేవలం 35 శాతం సీట్లు మాత్రమే గెలుపొందడమే 28.6 శాతం ఓట్లు లభించాయి. కానీ 2014 లోక్ సభ ఎన్నికల్లో 42 శాతం ఓట్లు బీజేపీకి గెలుచుకున్నది. మేయర్ పదవులకు జరిగిన పోలింగ్లో బీజేపీ 41.4 శాతం పొందింది. మిగతా ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు 15 - 18 శాతం మధ్య సీట్లు లభించాయి. 198 నగర పాలిక పరిషద్ అధ్యక్ష ఎన్నికల్లో 70 చోట్ల మాత్రమే బీజేపీ గెలుపొందింది. ఓట్ల శాతంలో ఎస్పీకి 21.7 శాతం పోలయ్యాయి. ప్రాంతీయ విశ్లేషణ ప్రకారం వచ్చే లోక్సభ ఎన్నికల్లో నగర పాలిక పరిషత్, నగర పంచాయతీల్లో గెలుపొందిన వారి నుంచి సవాల్గా పరిణమించింది. రెండు ప్రాంతాల్లో 98 స్థానాలకు 90 స్థానాల్లో ఎస్పీ, బీజేపీ పోటీ పడ్డాయి. 2014 లోక్ సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ రీజియన్ లోనూ బీజేపీ గణనీయ ఆధిక్యాలు సాదించింది. పశ్చిమ యూపీ, బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో ఎస్పీ 20 శాతం ఓట్లు పొంది బీజేపీకి సవాల్ విసిరింది. బీఎస్పీ మాత్రం ఆగ్నేయ యూపీలోనే కొన్ని సీట్లు పొందగలిగింది. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ వెనుకబడి ఉన్నది. నగర పంచాయతీ చైర్మన్ పదవుల్లో 438 చోట్ల కేవలం బీజేపీ 100 పట్టణాల్లో పాగా వేయగా, స్వతంత్రులు 182 చోట్ల గెలుపొందడం గమనార్హం.
స్థానిక ఎన్నికల ఫలితాలపై అఖిలేశ్ ఇలా
యూపీ నగర, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నదని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వాడటం, వాటిని ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ గెలుపొందిందన్నారు. 14 నగర మేయర్ పదవులను గెలుచుకోవడంపై బీజేపీ అదే పనిగా ప్రచారం చేసిందని, నగర పాలిక పరిషత్లు, నగర పరిషత్ ఎన్నికల్లో ఓటమిపై ఎందుకు చర్చకు ముందుకు రావడం లేదని అఖిలేశ్ యాదవ్ నిలదీశారు.